పొత్తుల మాటలు ప్రబలంగా వ్యాపిస్తుండడంతో అధికార వైసీపీ నాయకుల గుండెల్లో కత్తులు గుచ్చుకుంటున్నట్టుగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తే, వైసీపీ కొమ్ములు విరిచి కూలగొడతామని పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఆవిర్బావ సభలో పవన్ కల్యాణ్ గర్జించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీశాయి. జనసేన అధినేత కామెంట్లపై అధికార వైసీపీకి చెందిన నాయకులు కూడా అంతేస్థాయిలో స్పందించారు.
ఒకవైపు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఇంకోవైపు మరో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరావులు స్పందించిన తీరు చూస్తుంటే… అధికార పక్షం నేతలలో ఒకింత అసహనంతో పాటు ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ నాయకులు రూట్ మ్యాప్ ఇస్తే తన తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుడతామని పవన్ కల్యాణ్ విస్పష్టంగా ప్రకటించడంతో అధికార పక్ష నాయకులలో ఒకింత అలజడి రేగినట్టుగానే అంతా భావిస్తున్నారు.
గుంటూరు జిల్లా ఇప్పకుంటలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభ విజయవంతమైన విషయం విదితమే. ఈ సభలో ప్రసంగించిన ఆ పార్టీ అధినేత పవన్ కణ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సివుందని చేసిన కామెంట్స్ పొత్తులపై కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బారతీయ జనతాపార్టీతో జతకలిసి నడుస్తున్న జనసేన, రానున్న ఎన్నికలకు ముందే తెలుగుదేశం కూడా కలిసి ఎన్నికల పోరులో తలపడుతుందన్న చర్చకు తావిచ్చింది. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పలువర్గాలను దూరం చేసుకుంది. గత ఎన్నికల ముందు సీపీఎస్ రద్దు, కొత్త వేతన కమిషన్ సిఫార్సుల అమలు తదితర హామీలతో ఉపాధ్యాయులు, ఎన్ జీవోల మనసును గెలుచుకుని విజయం సాధించిన వైసీపీ ఇటీవల ఆయా వర్గాలకు దూరమయ్యింది. ఈ పరిస్థితులో జనసేన అధినేత ఆయా వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. సీపీఎస్ రద్దుపై తనకు అవగాహన ఉందని, తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా దాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పోలీసుల సమస్యలను కూడా ప్రస్తావించి వారిని కూడా తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
ఇప్పటికే భారతీయ జనతాపార్టీ ఉత్తరాదిలోని నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించి జోష్ మీద ఉంది. ఇప్పుడు ఆ పార్టీ ఉభయ తెలుగురాష్ట్రాలలో తమ పార్టీని విస్తృతం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రానున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడగలిగితే, వైసీపీ ఓటమి ఖాయమని ఆయా పక్షాల నేతలు భావిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుతో పొత్తు కుదిరితే, అది పవన్ కల్యాణ్ కే నష్టదాయకమని వైసీపీ నాయకులు చెప్పడమే వారి ఆందోళనను స్పష్టం చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.