ద్వీప దేశం శ్రీలంకలో శాంతిభద్రతల పరిస్థితులు విషమించాయి. పాలకుల తప్పిదాలతో కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పొరుగుదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లెక్కి నిరసన ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వ్యవసాయ దిగుబడులు తగ్గిపోవడంతో శ్రీలంకలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోపక్క ఎగుమతులు లేకపోవడంతో విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయి. ఆహారం, ఇంధనం దిగుమతులకూ ప్రభుత్వం వద్ద నగదు లేదు. ఇంధనం, ఔషధాల కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితి అధ్వానంగా మారింది. భారత్ అందిస్తున్న మానవతా సాయం కూడా ఆ దేశ అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో గతనెల రోజులుగా శ్రీలంక వ్యాప్తంగా వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు ప్రజల ఆందోళనలకు తల ఒగ్గిన ప్రధాని మహీంద రాజపక్స పదవికి రాజీనామా చేసినా ప్రజల నిరసనలు ఆగడం లేదు.
శుక్రవారం రాత్రినుంచి దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి అమలవుతున్నా ప్రజలు వీధుల్లోకి రావడం మానలేదు. ప్రధాని కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేస్తున్న ప్రజలపై రాజపక్స మద్దతుదారులు దాడులకు తెగబడటంతో రెండు పక్షాల మధ్య హింసాకాండ చెలరేగింది. ప్రతిదాడుల్లో భాగంగా జరిగిన పరిణామాల్లో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అతుకొరల ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజా హింసలో ఇప్పటిదాకా 174 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రజలపై దాడులకు పాల్పడిన దుండగులను బస్సుల్లో రాజపక్సనే రప్పించారని, ప్రస్తుత హింసాకాండకు ఆయనే బాధ్యత వహించాలని ఆ దేశంలోని మాజీ క్రికెటర్లు సహా పలువురు విరుచుకుపడుతున్నారు. దాడి తరువాత తిరిగి వెళుతున్న రాజపక్స మద్దతుదారులను ఎక్కడికక్కడ జనం అడ్డుకుని వారిపై దాడులకు దిగారు.
అంతేకాదు ఆగ్రహించిన జనం అధికార పార్టీ నేతలకు చెందిన నేతల ఇళ్లపై దాడులకు దిగి వాటిని దహనం చేస్తుండటంతో కొలంబో రావణకాష్టాన్ని తలపిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొలంబోకు 250 కిలోమీటర్ల దూరంలోని హంబన్తోటలో ఉన్న రాజపక్స పూర్వీకుల ఇంటికి సైతం జనం సోమవారం నిప్పు పెట్టారు. ప్రధాని రాజపక్స అధికారిక నివాసం వెనుక గేటు వద్ద కూడా ఆందోళనకారులు మంటలు రాజేసినట్టు స్థానిక మీడియా పేర్కొంది. పోలీసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ వాహనాలు తగలబడుతున్నట్టు మీడియా వర్గాలు తెలిపాయి. పరిస్థితులు అదుపు తప్పడంతో ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ అమలవుతోంది. రెండున్నర దశాబ్దాల పాటు జాతుల మధ్య పోరాటంతో నలిగిపోయిన శ్రీలంక ఆర్థికంగా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న సమయంలో తాజా పరిణామాలతో ఆ దేశం మరోసారి సంక్షోభంలో చిక్కుకోవడం విషాదకరమేనని చెప్పాలి.