బాలీవుడ్ పరిశ్రమకు దక్షిణాది చిత్రాల సత్తా ఏంటో చాటి చెప్పిన ఘనత దర్శకధీరుడు రాజమౌళిదే. ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. వెండితెరపై రాజమౌళి స్థాయిలో మ్యాజిక్ చేయడం తమకు సాధ్యం కాదని ఉత్తరాది దర్శకులు కూడా అంగీకరించారు. అయితే ఇప్పుడు రాజమౌళికి దీటైన పోటీ మరో దక్షిణాది దర్శకుడి నుంచే ఎదురవుతుండటం విశేషం. అవును.. ఆ దర్శకుడు మరెవరో కాదు.. కేజీఎఫ్-1, కేజీఎఫ్ చాఫ్టర్-2 చిత్రాలతో కన్నడ సినిమా స్థాయిని అమాంతం పాన్ ఇండియా స్థాయికి పెంచేసిన ప్రశాంత్ నీల్.
యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం తోనే దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక నాలుగు వారాల క్రితం విడుదలైన కేజీఎఫ్-2 బాక్సాఫీసు వద్ద ఎవరూ ఊహించని స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం తాజాగా రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ రికార్డునూ అధిగమించి ఏకంగా ఇండియన్ సినిమా హిస్టరీలో మూడో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ సుమారు రూ. 1,100 కోట్లు వసూలు చేయగా, కేజీఎఫ్-2 ఆ రికార్డును అధిగమించి ఇంకా థియేటర్లలో చెప్పుకోతగ్గ వసూళ్లతో కొనసాగుతోంది. ఈ చిత్రం కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రాలు దంగల్, బాహుబలి ది కంక్లూజన్ మాత్రమే.
నిజానికి ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ మూవీ కంటే చాలా తక్కువ వ్యయంతోనే ప్రశాంత్ నీల్ తెరకెక్కించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్నీల్తో కలిసి పని చేసేందుకు ఇప్పుడు భాషా భేదం లేకుండా స్టార్ హీరోలంతా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత తారక్తో ఓ సినిమా చేసేందుకు కమిటైనట్టు తెలుస్తోంది. కేజీఎఫ్ సంచలన విజయం తరువాత ఇతడి తరువాత ప్రాజెక్టులపై ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. మరి వీటిని అందుకోవడంలో ఈ దర్శకుడు ఏమేరకు విజయం సాధించగలడో చూడాలి మరి.