గడచిన రెండు దశాబ్దాలుగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల నుంచి స్వదేశానికి పెట్టుబడులుగా భారీ స్థాయిలో నిధులు తరలివస్తున్న విషయం తెలిసిందే. భారతీయులు ఐటీ రంగంలో ముందంజలో ఉండటం కూడా ఇందుకు దోహదం చేస్తోందని చెప్పాలి. కాగా ఇలా పెట్టుబడి పెట్టేందుకు ఈతరం ఎన్నారైలు ఎక్కువగా కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ఎంచుకుంటున్నట్టు ఓ సర్వే లో వెల్లడైంది. ఎమ్వైఆర్ఈ క్యాపిటల్ ఆర్థిక సంస్థ ఈ సర్వే నిర్వహించింది. అంతేకాదు.. ఈ రకమైన పెట్టుబడుల్లో అధిక శాతం మూడు నగరాలు ఆకర్షిస్తున్నట్టు ఆ సర్వే తెలిపింది.
ఈ నగరాల్లో తొలిస్థానంలో బెంగళూరు నిలవగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై రెండో స్థానంలోను, పూణె మూడో స్థానంలోనూ నిలిచాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 53 శాతం పైగా కమర్షియల్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేందుకే తాము ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. కాగా ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేస్తామని, 21 శాతం మంది, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులకు 19 శాతం మంది మొగ్గు చూపారు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి మెరుగైన రాబడులు ఇవ్వడం, ఆదాయంపై పన్నుల భారం తక్కువగా ఉండటం వారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేందుకు కారణంగా సర్వేలో తేలింది.