‘ వంద మీటర్లో, 200 మీటర్లో కాదు.. ఏకంగా 11 కిలో మీటర్ల పొడవున ఒక వస్త్రాన్ని తయారు చేయడం మాటలు కాదు.. ఆ వస్త్రాన్ని తయారు చేసిన మహిళలు సామాన్యులు కాదు..’
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడకు చెందిన మహిళలు 11 కిలోమీటర్ల పొడవున్న వస్త్రాన్ని తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. దంతేవాడలోని డెనెక్స్ అనే టెక్స్టైల్ ఫ్యాక్టరీకి చెందిన మహిళలు ఈ వస్త్రాన్ని రూపొందించారు. ఈ వస్త్రాన్ని.. ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్ చేతుల మీదుగా స్థానికంగా ఉన్న దంతేశ్వరి దేవి ఆలయానికి సమర్పించారు. ఇదివరకు మధ్యప్రదేశ్లోని మందసూర్ నర్మదా మైయా ఆలయానికి అక్కడి ప్రజలు 8 కిలోమీటర్ల పొడవు ఉన్న వస్త్రాన్ని సమర్పించారు. తాజాగా దీనిని బద్దలు కొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పారు దంతేవాడ మహిళలు. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో దీనికి చోటు దక్కింది.
మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా డెనెక్స్ పేరుతో 2021 జనవరి 31న వస్త్ర పరిశ్రమను ప్రారంభించారు సీఎం. ఈ క్రమంలో ఇప్పటివరకు 500 మందికిపైగా మహిళలకు ఉపాధి లభిస్తోంది. 1200లకుపైగా కుటుంబాలకు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా ఈ సంస్థ కృషి చేస్తోందని అధికారులు వెల్లడించారు.