వడగాల్పులతో భానుడి భగభగలు కొనసాగుతున్న వేళ.. భారత వాతావరణ విభాగం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు వెల్లడించింది. సాధారణం కంటే మూడు రోజుల ముందుగానే కేరళను రుతుపవనాలు పలకరించినట్లు వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా గత నెల నుంచి రుతుపవనాల్లో వేగం పెరిగిందని.. వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది త్వరగా భారత్లోకి ప్రవేశించాయని స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గతంలో వెల్లడించింది.