‘మనం ఏం చెప్పినా జనం నమ్మేస్తారు. వెర్రి గొర్రెలు..’ అనుకుంటే అన్ని వేళలా మాయ చేయడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. దేనికైనా ఒక టైమ్ రావాలంటారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ టక్కు-టమార గారడీలతో ఇన్నాళ్లు జనాన్ని బాగానే వంచించినా నడిచిపోయింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పన్నాగాలకు బలవ్వడానికి ఆంధ్రా జనం ఇంకా సిద్ధంగా ఉన్నారా? అనేది ఆలోచించుకోవాలి.
‘కోనసీమ జిల్లా పేరు మార్పు తెరపైకి తెచ్చి అమలాపురంలో అల్లర్లకు కారణమైన వైసీపీ పెద్దలు తప్పించుకోచూసినా జనం నమ్మకపోవచ్చు. సాక్షాత్తూ అధికార పార్టీ మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను పెట్రోల్ పోసి తగలబెట్టే దారుణ పరిస్థితులను కట్టడి చేయక పోవడం వెనుక పోలీసులకు వచ్చిన ఆదేశాలపై చర్చ జరుగుతోంది. ఉద్యమం జరుగుతుందని తెలిసిన పోలీసులు మిన్నకుంటారా? ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. కోనసీమలో కుల వైషమ్యాలను రెచ్చగొట్టడం ద్వారా దళితులలో కోల్పోతున్న నమ్మకాన్ని తిరిగి పొందాలని వైసీపీ చేసిన విశ్వ ప్రయత్నం బెడిసికొట్టింది.
సుబ్రమణ్యం హత్య
సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంత బాబు) తన మాజీ డ్రైవర్ సుబ్రమణ్యంను అతని ఇంటి నుంచి తీసుకువెళ్లి.. మూడు గంటల వ్యవధిలో మృత దేహాన్ని తీసుకువచ్చి .. యాక్షిడెంట్ లో చనిపోయాడని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి. కేసు నుంచి తప్పించుకోగలననే బలమైన నమ్మకం అతనికి ఎక్కడ నుంచి వచ్చింది. అనంత బాబు క్రిమినల్ చరిత్ర వైసీపీ నేతలకు తెలియంది కాదు. దళిత యువకుడు సుబ్రమణ్యం హత్యతో వైసీపీలో అప్పటికే వ్యతిరేకత మొదలైన దళితులలో.. ఇది తార స్థాయికి చేరడంతో.. వెనువెంటనే అమలాపురం అల్లర్ల సంఘటన తెరపైకి వచ్చిందంటే ఎలా అర్ధం చేసుకోవాలి. ఇలాంటి వాటిని అర్ధం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కాకపొతే బయటపడరు అంతే. తమకు అవకాశం వచ్చినపుడు వాటిని ఎలా ప్రయోగించాలో జనానికి తెలియకుండా ఉంటుందా?