దేశంలో ఇప్పుడు నడుస్తున్నవి సంప్రదాయ రాజకీయాలు కాదు..వాటికి కాలం చెల్లిపోయిందని చెప్పాలి. ప్రజలను ఆకట్టుకునే ఎత్తులు, జిత్తులు, యుక్తులు చేతనైనంతవరకు, వీలైనంతవరకు ఏమైనా చేయి… అంతిమంగా ఎన్నికల గోదాలో గెలిస్తేనే రాజకీయ యవనికపై నిలిచేది.. అనే దిశగా చాలాదూరం వెళ్లిపోయిన దేశ రాజకీయాలను గొప్పగా అవగాహన చేసుకుని, ఆచరణలో పెడుతున్న వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారుతున్నప్పుడు ముందుగానే ఎవరూ ఊహించని వ్యూహాలు పన్ని వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో టీఆర్ఎస్ అధినేత చాణక్యాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయలేరు.
గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆయనను అలా అంచనా వేసినందునే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి కూడా తెలంగాణలో దారుణంగా దెబ్బతిన్నది. తెచ్చిన ఘనతను తన ఖాతాలో వేసుకున్న కేసీఆర్ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. నాడు కాంగ్రెస్ అధిష్ఠానానికి మేమున్నాము.. తెలంగాణలో పార్టీని గెలిపిస్తామని డాంబికాలు పలికిన నాటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరూ నేడు పత్తా లేరు. కొంతమంది ఏకంగా కేసీఆర్ నీడకే చేరుకున్నారు. నాడు కాంగ్రెస్, టీడీపీ పార్టీలను బలహీనపరచేందుకు కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పెద్దలను గొప్పగా వినియోగించుకున్నారు.
ప్రస్తుతం దేశ రాజకీయాలను శాసిస్తున్న బీజేపీ పెద్దలు నరేంద్రమోదీ, అమిత్షాల ద్వయం ఈ తరహా రాజకీయాలలో కేసీఆర్ కంటే రెండాకులు ఎక్కువే చదివారు. ముందుగా తనకు రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థి ఐన కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలలో ఆ పార్టీని దెబ్బ తీయడం, ఆ తరువాత అందుకు సహకరించిన ప్రాంతీయ పార్టీని టార్గెట్ చేసి, అక్కడ కాషాయ జెండా ఎగరేయడం.. ప్రస్తుతం మోదీ,షాల ఆధ్వర్యంలోని బీజేపీ ప్రధాన అజెండా ఇదే. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో జెండా పాతాలని సంకల్పించింది. ఇదే ఇప్పుడు కేసీఆర్కు సంకటంగా మారింది.
కేసీఆర్ మొన్నటిదాకా అటు కేంద్రంలోని బీజేపీతోనూ ఇటు ఏపీలోని వైసీపీతోనూ సత్సంబంధాలను నెరుపుతూ వచ్చారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో సున్నం పెట్టుకున్నా, ఏపీ ముఖ్యమంత్రితో ఆయనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కాగా బీజేపీ నుంచి తన పార్టీని కాపాడుకుని రాష్ట్రంపై తన పట్టు నిలుపుకునేందుకు ఇప్పుడు బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఏర్పాటుకు మరోసారి కేసీఆర్ నడుం బిగించారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో భారతీయ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేసీఆర్ అందుకు అనుసరిస్తున్న వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో తెలియదు గానీ మీడియా సంస్థలకు మాత్రం బోలెడు పని చెపుతున్నారు.
దేశంలో పార్టీని విస్తరించాలనుకుంటే ముందుగా తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీ పైన దృష్టిసారించాలని కేసీఆర్ భావిస్తున్నారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. తాజాగా కేసీఆర్ ఏపీకి చెందిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత ఉండవల్లి అరుణ్కుమార్తో సమావేశం కావడం ఆసక్తి కలిగిస్తోంది. ఉండవల్లి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ విజన్ను మెచ్చుకోవడంతోపాటు, మోదీషాలను, బీజేపీని ఎదుర్కోగల ఏకైక నేత కేసీఆర్ మాత్రమేనని తాను భావిస్తున్నట్టు చెప్పడం రాజకీయ వర్గాలతోపాటు ప్రజల్లోనూ చర్చకు దారితీసింది.
నిజానికి ఉండవల్లి రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగలేదని గతంలో న్యాయస్థానంలో కేసు వేశారు. ఏపీకి అన్యాయం జరుగుతోందంటూ ప్రెస్ మీట్లు పెట్టి తరచుగా వాపోతుంటారు. అలాంటిది ఇప్పుడాయన కేసీఆర్ తో కలిసి చేయబోయే రాజకీయం ఏమిటో ఎవరికీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. మరోపక్క ఉండవల్లికి ఇటు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తోనూ సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఉండవల్లి ద్వారా కేసీఆర్ కోరుకునే రాజకీయ ప్రయోజనాలకు బహుశా ఇదే హేతువు కావచ్చు. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో వచ్చే కొద్ది నెలల కాలంలో జరగబోయే కీలక పరిణామాలకు ఇది ముందస్తు సూచనగా భావించాలేమో..!