సంక్షోభ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనే సిసలైన సత్తా వెలుగులోకి వచ్చేది. ధైర్యంగా నిలబడగలిగితేనే పరిస్థితులు మళ్లీ అనువుగా అనుకూలంగా మారేది.. వ్యక్తులకైనా.. రాజకీయ శక్తులకైనా సమానంగా వర్తించే సూత్రమిది. దీనిని తెలుగుదేశం పార్టీకి మరింతగా అన్వయించుకోవచ్చు. మూడేళ్ల క్రితం ఏపీలో టీడీపీకి ఎదురైన ఘోర పరాజయం చూశాక ఇక ఆ పార్టీ కోలుకోవడం కష్టమని రాష్ట్రంలో అత్యధికులు భావించారు. దానికి తగినట్టుగానే టీడీపీని రాష్ట్రంలో లేకుండా చేయడమే లక్ష్యమన్నట్టుగా అధికార పార్టీ నుంచి రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్బంధం, అణచివేత ఎదురయ్యాయి. వీటన్నింటినీ ఆ పార్టీ తట్టుకుని నిలిచింది. మళ్లీ జవసత్వాలను కూడగట్టుకుని పునర్వైభవం కోసం పోరాటానికి సమాయత్తమవుతోంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు సహా పలువురు చిన్నాపెద్దా నాయకులపై ఏదో ఒకకేసు పెట్టి అరెస్టులకు పాల్పడి క్యాడర్ స్థైర్యాన్ని దెబ్బతీయాలని వైసీపీ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నాలు చేసింది. వీటికి కాస్తో కూస్తో నాయకులు జంకారేమో కానీ.. అవి కార్యకర్తలకు పార్టీపై ఉన్న విశ్వాసాన్ని, వారి మనోబలాన్ని కించిత్తు కూడా తగ్గించలేకపోయాయని చెప్పాలి. పైగా వారిలో పార్టీని కాపాడుకోవాలన్న కసిని మరింత పెంచాయని మహానాడుకు వస్తున్న విశేష స్పందన చెపుతోంది.
స్థానిక ఎన్నికల్లో టీడీపీ తరపున నామినేషన్ వేయనివ్వకుండా దౌర్జన్యానికి పాల్పడిన వైసీపీ నాయకులను 70 ఏళ్ల వృద్ధుడైనా ఒక్కడై ఎదిరించి తొడగొట్టి నిలిచిన అంజిరెడ్డి, అవతలి పార్టీ కార్యకర్తలు పీకపై కత్తి ఉంచినా జై టీడీపీ అంటూ నినదించిన చంద్రయ్య, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయం.. కావాలంటే నాకున్న ఒకటిన్నర ఎకరాల పొలం పందెం కడతా.. అంటూ సవాల్ విసిరిన వెంకాయమ్మ… వీళ్లంతా ఒక ప్రాంతానికి చెందిన వాళ్లు కాదు.. ఒక కులానికి చెందినవారు అంతకంటే కాదు.. టీడీపీకి క్షేత్ర స్థాయిలో పునాదులు ఎంత బలంగా ఉన్నాయో చాటిచెప్పిన సజీవ సాక్ష్యాలు వీళ్లు. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు త్రికరణశుద్ధిగా పాటించిన సంక్షేమం, సామాజిక సమన్యాయం, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల హృదయాల్లోకి ఎంతలోతుగా చొచ్చుకుపోయాయో తెలిపే పార్టీకి నిజమైన మూలస్తంభాలు వీళ్లు. ఏకంగా పార్టీ అధ్యక్షుడికే ధైర్యం చెప్పే ఇలాంటి కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం. మహానాయకుడు నందమూరి తారకరామారావు శత జయంతి వేళ నలభై ఏళ్లు కాదు.. మరో వందేళ్లయినా పార్టీని, ఆయన రగిలించిన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళతామని చెప్పే చైతన్య దీప్తులు వీళ్లు. మహనీయుడు ఎన్టీఆర్ రగిల్చిన స్ఫూర్తి,, కేడర్ లో నిత్యనూతనమై వెలిగిస్తుంది.
వైసీపీ ‘గాలి’ ఇసురు అంతే..