రాజకీయంగా తామనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం మెరుగైన మార్గమని రాజకీయ నాయకులు భావించడం తెలుగు రాష్ట్రాల్లో కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే ఇదో సంప్రదాయంగా మారిపోయిందని చెప్పాలేమో. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆదరణను పెంచుకోవడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మొదటిసారిగా ఈ విధానాన్ని ఎంచుకున్నారు. 2003 ఏప్రిల్ 9న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 60 రోజుల పాటు ఆయన చేసిన పాదయాత్ర అప్పట్లో ఒక సంచలనం. ఈ యాత్ర ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి తాననుకున్న విధంగానే ప్రజల్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా తనకు పార్టీలో మరెవరూ పోటీకి రాలేనంతగా అధిష్ఠానం వద్ద గుర్తింపును తెచ్చుకున్నారు.
ఆ తర్వాత 2004 ఎన్నికల్లో టీడీపీని ఓడించి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆ తరువాత వైఎస్ హఠాన్మరణంతో మారిన రాజకీయ ముఖచిత్రం నేపథ్యంలో చంద్రబాబు ఆరు పదుల వయసులో 2012లో చేపట్టిన జనచైతన్యయాత్ర 2014 ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణమని చెప్పాలి. ఇక 2017లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన పాదయాత్ర 2019 ఎన్నికల్లో ఆయన పార్టీ అఖండ విజయానికి, తద్వారా ఆయన సీఎం కావడానికి ప్రధాన భూమిక పోషించింది. ఈ అనుభవంతోనే ఆయన సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించి అక్కడ పాదయాత్ర కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కొంతకాలంగా నిలిచిపోయిన ఆమె పాదయాత్ర తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా తాజాగా తెలంగాణలో ఐపీఎస్ అధికారిగా పనిచేయడంతోపాటు స్వచ్ఛంద సంస్థను నిర్వహించడం ద్వారా ప్రజల్లో మంచి ప్రచారం లభించిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఐపీఎస్ వదులుకుని బీఎస్పీలో చేరడం ద్వారా పూర్తిస్థాయి రాజకీయవేత్తగా మారిన ఈ మాజీ పోలీస్ అధికారి బహుజనుల్లో చైతన్యం తీసుకువచ్చి, అధికారానికి చేరువ చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు. మరి ఆయన తన పాదయాత్ర ద్వారా ఏమేరకు ప్రజాదరణ పొందగలరో చూడాల్సి ఉంది.