ప్రస్తుతం అల్లం, వెల్లుల్లి రేట్లు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఘాటెక్కి మరింత వెగటుగా మారాయి. ప్రస్తుతం వెల్లుల్లి ధర కిలో 500పైనే పలుకుతోంది. మరో రెండు వారాల్లోనే డబుల్ అయ్యే పరిస్థితి. ఔషధాల తయారీలో కూడా వాడే ఈ వెల్లుల్లి సాగు ఈ సంవత్సరం వర్షాభావం కారణంగా దిగుబడి భారీగా తగ్గింది. దీంతో సప్లై తగ్గి డిమాండ్ పెరిగింది. వినియోగదారులకు భారంగా మారింది.
నాణ్యతను బట్టి రూ.350 నుంచి 500కు చేరింది. కర్నూలు పాత బస్టాండ్ లో హోల్సేల్ మార్కెట్ లోనే రూ.350 నుంచి 400 పలుకుతోంది. నాణ్యమైన వెల్లుల్లి దర రూ.500 దాటింది. ఉత్తరాదిన అనూహ్య వర్షాల వల్ల, దక్షిణాదిన వర్షాభావం వల్ల వెల్లుల్లి దిగుబడి దెబ్బతినిందని వ్యాపారులు అంటున్నారు. చాలా ప్రాంతాల్లో తుఫాను కూడా వెల్లుల్లి పంటను నష్టపరిచింది. సాధారణంగా ప్రతి సంవత్సరం చలికాలంలో వెల్లుల్లి ధరలు పెరుగుతాయి. కొత్త పంట మార్కెట్లోకి వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
అయితే ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెల్లుల్లి ఎగుమతిపై నిషేధం విధించింది. దేశంలోనే అతిపెద్ద వెల్లుల్లి మార్కెట్లలో ఒకటైన గుజరాత్ లోని జామునగర్, మండి మార్కెట్లలో కిలో వెల్లుల్లి టోకు ధర 300 నుంచి రూ.350కు చేరుకుందని అక్కడ వ్యాపారులు చెప్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో వెల్లుల్లి ఎక్కువగా సాగవుతోంది. ధరలను కేంద్రo తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.