“కిలో మామిడి పండ్లు వంద రూపాయలంటేనే …అబ్బో.. అంత రేటే? అనుకుంటాం. పోనీ ఈ ఏడాది కాపు సరిగాలేక అంత రేటంటే పోనీలే… అస్తమానూ కొంతమా? అని నాలుగైదు కిలోలు కొనేందుకు మామిడి ప్రియులు వెనుకంజ వేయరు. అయితే కిలో వంద కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా కిలో మామిడి పళ్ళు రు. 2.70 లక్షలట. ఇది ఎక్కడైనా విన్నారా? మీరు వినకపోయినా ఇది మాత్రం నిజం.”
ప్రపంచంలోనే భారీ ధర పలికే మామిడి పండ్లను సాగుచేస్తున్న రైతు పేరు సంకల్ప్ సింగ్ పరిహార్మధ్యప్రదేశ్ జబల్పుర్కు 25 కిలోమీటర్ల దూరంలో నానాఖేదా ప్రాంతంలో శ్రీ మహాకాళేశ్వర్ హైబ్రిడ్ ఫాం హౌస్ ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ పండే మామిడి రకాలు దేశంలో మరెక్కడా ఉండవు. జంబో గ్రీన్ మ్యాంగోగా పిలిచే ‘తలాల గిర్ కేసర్’ సహా నేపాల్ రకం కేసర్ బాదం మ్యాంగో, చైనాకు చెందిన ఐవరీ మ్యాంగో, అమెరికా ఫ్లోరిడాలో పండించే మాంగిఫెరా టామీ ఆట్కిన్స్ రకాల మామిడి రకాలను ఇక్కడ సాగు చేస్తున్నారు. అత్యంత ఖరీదైన రకాల్లో ఒకటైన ఈ ఫ్లోరిడా మ్యాంగోను ‘బ్లాక్ మ్యాంగో’ అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ తోటలోనే కాదు దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రత్యేక మామిడి రకం మియాజాకి. జపనీస్ ఎగ్ప్లాంట్ అని కూడా పిలిచే ఈ రకం మామిడి పండ్ల ధర కిలో ఏకంగా రూ.2.70లక్షలు. ఇలా మొత్తం 8 విదేశాలకు చెందిన మామిడి రకాలు సహా భారత్కు చెందిన 20 రకాలను సంకల్ప్ పరిహార్ సాగు చేస్తున్నారు. అంత విలువైనవి కాబట్టే తోటకు లక్షల రూపాయలు వెచ్చించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మియాజాకి మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రకానికి చెందినది అంటున్నారు సంకల్ప్. భారత్లోని కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు వీటిని సాగు చేస్తున్నట్లు తెలిపారు.
బ్లాక్ మ్యాంగో ఎంతో ఆరోగ్యకరమని, మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తినవచ్చని వివరించారు. వీటిలో గ్లూకోస్, చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయని, అందువల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవని చెపుతున్నారు. అత్యంత అరుదైన ఈ మామిడి పండ్లు బయట నుంచి పర్పుల్ కలర్లో, లోపల ఎరుపు రంగులో ఉంటాయట. ఈ తోటలో పండే చైనా ఐవరీ మామిడి పండ్లు ఒక్కో కాయ 2-3 కిలోలు వరకు బరువు ఉంటుంది. అయితే ఇంత భారీ ధర పెట్టి కొనుగోలు చేసేవారు ఉన్నారా? అనేదే సందేహం. అయితే రైతు సంకల్ప్ సింగ్ పరిహార్ మాత్రం … ” మామిడి పండ్లు పక్వానికి రాక ముందే కొనుగోలుకు ఆర్డర్స్ వస్తున్నాయంటున్నారు.