ఆరు వందల ఏళ్ల నాటివిగా భావిస్తున్న పురాతన హిందూ దేవతల విగ్రహాలను తమిళనాడు సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహాలలో.. నటరాజస్వామి, వేంద్ హరశివ, విష్ణుమూర్తి ప్రతిమలు ఉన్నాయి. పుదుచ్చేరిలోని జోసెఫ్ కొలొంబానీ అనే వద్ద ఈ విగ్రహాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. వీటికి సంబంధించిన ధ్రువపత్రాలేవీ అతడి వద్ద లేవని పేర్కొన్నారు. 600 ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్న ఈ విగ్రహాలను.. 1980కి ముందు హిందూ దేవాలయాల నుంచి చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రు.12 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఈ విగ్రహాలు చోళ, విజయనగర సామ్రాజ్యాలు పాలనా కాలం నాటివని అధికారులు చెబుతున్నారు. నటరాజ విగ్రహం రెండు అడుగుల ఎత్తు, 23 కేజీల బరువు ఉందని అధికారులు తెలిపారు. దీని విలువే రూ.6 కోట్లు ఉంటుందని చెప్పారు. మిగతా రెండు విగ్రహాలు రూ.3 కోట్ల చొప్పున ఉంటాయని లెక్కగట్టారు. ఈ విగ్రహాలను ఫ్రాన్స్కు తరలించాలని నిందితులు గతంలో ప్రయత్నించారని అధికారులు చెప్పారు. అయితే, విగ్రహాలను స్మగ్లింగ్ చేయలేకపోయారని… తమకు అందిన రహస్య సమాచారం ప్రకారం విగ్రహాలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశామని సీఐడీ విభాగం అధికారి తెలిపారు.