ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. ఈ వాణిజ్య ప్రకటన చాలా కాలం నుంచి అందరి నోట్లో నానుతూనే ఉన్నది. ఇక్కడ వ్యవసాయ వాణిజ్యం కోసం ఓ ఐడియాతో రావాలంటూ యూనివర్శిటీ భారీ ఆఫర్ ఇస్తున్నది. అగ్రి బిజినెస్ కోసం సూపర్ డూపర్ ఐడియాతో రావాలని హర్యానా హిసార్లోని చౌదరీ చరణ్ సింగ్ క్రిషీ విశ్వవిద్యాలయం ఆహ్వానిస్తున్నది. ఎంపికైనా ఐడియాకు రూ.25 లక్షలు పెట్టుబడిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ పోటీల్లో పాల్గొనాలని ఆశించేవారు ఈ నెల 31 లోగా యూనివర్శిటీ వెబ్సైట్ www.hau.ac.in లో దరఖాస్తు చేయాలి.
వ్యవసాయ రంగంలో స్టార్టప్కు కొత్త కోణాన్ని అందించేందుకు విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, పారిశ్రామికవేత్తలు.. ఎవరైనా తమ ఐడియాలను షేర్ చేసుకోవచ్చు. మార్కెటింగ్, నెట్వర్కింగ్, లైసెన్సింగ్, ట్రేడ్మార్క్, పేటెంట్ టెక్నాలజీ, ఫండింగ్కు సంబంధించి శిక్షణ ఉంటుంది. వ్యవసాయ రంగంలో వ్యాపారం చేయాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం. పహల్, సఫాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి రూ.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడంతోపాటు రెండు నెలల శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
దరఖాస్తులను ఉచితంగా అందించవచ్చు. దరఖాస్తు చేసుకునే వ్యక్తి హర్యానాకు వచ్చి తన వ్యాపారాన్ని స్థాపించడానికి ఇష్టపడే వారై ఉండాలి. అగ్రి బయోటెక్, హార్టికల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్, పశుసంవర్ధక, ఫిషరీస్, మైక్రో ఇరిగేషన్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫార్మింగ్ మెకనైజేషన్, తక్కువ ఖర్చుతో కూడిన అధిక ఉత్పత్తి, సప్లై చైన్ మేనేజిమెంట్, హార్వెస్ట్ అండ్ పోస్ట్ హార్వెస్టింగ్, ఆహార ప్రక్రియ, వ్యాల్యూ యాడింగ్తో పాటు వ్యవసాయంలో కృత్రిమ మేధ మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని విశ్వవిద్యాలయం పేర్కొన్నది. మరెందుకాలస్యం.. ఇప్పుడే మీ ఐడియాలను పంపించండి.. అగ్రి బిజినెస్ కోసం రూ.25 లక్షల వరకు పెట్టుబడిగా పొందే ఛాన్స్దం దక్కించుకోవచ్చు.