కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక స్టార్టప్ కంపెనీ ‘ఇడ్లీ ఏటీఎం’ను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. తాజాగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఈ ఏటీఎంపై ఆసక్తి కనబరిచారు. ఇడ్లీలు ఎలా ఉన్నాయి..? అంటూ బెంగళూరు ప్రజలను ప్రశ్నించారు.
‘ఇడ్లీ ఏటీఎం’కు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా… ‘‘చాలా మంది రోబోటిక్ ఫుడ్ ప్రిపరేషన్, వెండింగ్ మెషీన్లను రూపొందించడానికి ప్రయత్నించారు. అయితే, ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. ఇందులోని పదార్థాలు తగినంతగా రిఫ్రెష్ చేయబడతాయని తేలింది. ఈ మెషీన్లోని ఇడ్లీల రుచి ఎలా ఉంది..? ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్లో కూడా ఈ ఇడ్లీ ఏటీఎంను పెడితే చూడాలనుకుంటున్నా’’ అంటూ రాసుకొచ్చారు.
బెంగళూరుకు చెందిన శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్లు స్థాపించిన స్టార్టప్ ఫ్రెషప్ రోబోటిక్స్, ఇన్స్టెంట్.. ఈ ఇడ్లీ తయారీ యంత్రాన్ని రూపొందించింది. ఇరవై నాలుగు గంటలు వేడి వేడి ఇడ్లీలు అందించే ఈ ఏటీఎంను ఫ్రెషాట్లో ఏర్పాటు చేశారు. ఇది 12 నిమిషాల్లో 72 ఇడ్లీలు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంది. చట్నీ, కారప్పొడి వంటి వాటితో ఇడ్లీలను ప్యాక్ చేసి కస్టమర్లకు అందిస్తోంది.