తనకిచ్చిన డేట్ ప్రకారం ప్రసవం కోసం ఆసుపత్రికెళ్లిన ఒక నిండు గర్భిణికి వింత సమస్యఎదురయింది. అక్కడ వైద్యులు చెప్పిన విషయం విని షాక్ కు గురయింది. అసలు ఆమె గర్భిణి కాదంటూ చెప్పడంతో అవాక్కయింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మి తొమ్మిది నెలల క్రితం కాకినాడ గాంధీనగర్లోని ఓ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంది. అయితే అక్కడి వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించారు. దీంతో మహాలక్ష్మి అప్పటి నుంచి వైద్యుల సూచన మేరకు ప్రతినెలా ఆసుపత్రికి వస్తూ పరీక్షలు చేయించుకుని మందులు వాడింది. ఆసుపత్రికి వచ్చిన ప్రతిసారీ స్కానింగ్ చేసి కడుపులోని బేబీ ఆరోగ్యంగా ఉందంటూ మందులు రాసిచ్చేవారు. ఈ క్రమంలో ఆరో నెలలో మరోమారు ఆసుపత్రికి వచ్చిన మహాలక్ష్మిని పరీక్షించిన వైద్యులు సెప్టెంబరు 22న ప్రసవం అవుతుందని డెలివరీ డేట్ కూడా ఇచ్చారు.
నెలలు నిండడంతో ఆమె తల్లిదండ్రులు డెలివరీ కోసం తమ కుమార్తెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మహాలక్ష్మిని పరీక్షించిన వైద్యులు షాక్ ఇచ్చారు. స్కానింగ్ చేసి అసలు ఆమె గర్భవతే కాదని చెప్పారు. దీంతో నిర్ఘాంతపోయిన కుటుంబ సభ్యులు కుమార్తెను తీసుకుని కాకినాడలో ఆమె తొలుత చూపించుకున్న ఆసుపత్రికి వెళ్లారు. అక్కడామెకు స్కానింగ్ తీయగా మహాలక్ష్మి గర్భంలో శిశువు లేదన్న విషయం స్పష్టమయింది. దీంతో కుటుంబ సభ్యులు మహాలక్ష్మిని ప్రతి నెలా పరీక్షిస్తున్న వైద్యురాలిని కలిసి ప్రశ్నించారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. మహాలక్ష్మి ఆమె కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. గర్భిణి అని నిర్ధారించి ప్రతి నెలా మందులు రాసిచ్చి వాడమని చెప్పేవారని వాపోయారు. గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతోందంటూ రాసిచ్చిన మందులు వేసుకున్నాక తమ కుమార్తె పొట్ట పెద్దదైందని.. పరీక్షలు, మందుల పేరుతో వేలకువేలు దండుకున్నారని ఆరోపించారు. ఇప్పుడసలు ఆమె గర్భిణే కాదంటున్నారంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన మహిళా సంఘాలు బాధిత కుటుంబానికి అండగా నిలిచాయి.