ప్రపంచ సినిమా రంగం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి అనేది తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీలో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించారు. ఈ భారీ బడ్జెట్ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం పొందిన విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉందని జోరుగా ప్రచారం సాగింది. ఉత్తమ నటుడు కేటగిరిలో రామరాజు పాత్రకు చరణ్, కొమరం భీమ్ పాత్రకు తారక్ను నామినేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు అమెరికా మూవీ పబ్లిషర్ వెరైటీ తెలిపింది.
దీంతో RRR మూవీ కచ్చితంగా ఆస్కార్ రేసులో ఉంటుందని అంతా ఆశించారు. కాని ఆ ఆశ నిరాశే అయింది. ఆర్ఆర్ఆర్కు ఆ అవకాశం దక్కలేదు. అయితే భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ ఎంపికయింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆ విషయాన్ని ప్రకటించింది. 95వ ఆస్కార్ అవార్డుల పోటీలకు ఛెల్లో షోను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ సుప్రాన్ సేన్ వెల్లడించారు. ఇంగ్లిష్లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’గా పిలుస్తున్న ఈ చిత్రానికి పాన్ నలిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 14న విడుదల కానుంది.