డ్రగ్స్ స్కాంలలో పెద్దపెద్ద మోడల్స్.. బడా హీరోలు, వ్యాపారవేత్తలు, వాళ్ల కొడుకులు, కూతుళ్లు బయట పడుతున్నారు. ఇప్పటికే చాలా మందిపై కేసులున్నాయి. ఇప్పుడు తాజాగా మరో మోడల్ పడ్డుపడ్డాడు. అధిక మొత్తంలో డ్రగ్స్ పట్టుపడ్డాయని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. కోటి రూపాయలకుపైగా విలువైన 1.010 కిలోల మాదకద్రవ్యాలను వారు పట్టుకున్నారు. ఈ సందర్భంగా 25 ఏళ్ల మోడల్ శుభమ్ మల్హోత్రా అలియాస్ సన్నీ , అతడి గర్ల్ ఫ్రెండ్ కీర్తి(27) ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఢిల్లీ యూనివర్సిటీ చుట్టుపక్కల కొందరు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు ఈ రాకెట్లో సన్నీ ప్రధాన పాత్రధారి అని గుర్తించారు. హిమాచల్ప్రదేశ్లోని మలానా నుంచి సన్నీ డ్రగ్స్ తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
హిమాచల్ప్రదేశ్లో రెండుమూడు రోజులు గడిపిన సన్నీ సింగు సరిహద్దు మీదుగా తన కారులో ఉదయం ఢిల్లీ వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సింగు సరిహద్దు వద్ద కాపు కాసిన పోలీసులు అతడి కారును ఆపాలని ప్రయత్నించినా అతడు అత్యంత వేగంగా దూసుకెళ్లి పోయాడు. దీంతో ఓ బృందం అతడి కారును అనుసరించగా, మరో బృందం అతడు నివసించే ఓల్డ్ గుప్తా కాలనీకి వెళ్లింది. 45 నిమిషాల ఛేజింగ్ తర్వాత ఓల్డ్ గుప్తా కాలనీలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. 2016లోనే తనకు ధూమపానం, డ్రగ్స్ అలవాటయ్యాయని, ఖర్చుల కోసం స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం ప్రారంభించినట్టు విచారణలో సన్నీ తెలిపాడని పోలీసుల తెలిపారు. ఇందులో పెద్ద ఎత్తున లాభాలు వస్తుండడంతో హిమాచల్ప్రదేశ్లోని కసోల్, మలానా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు చెప్పాడు. తనకు సాయంగా ఉండేందుకు స్నేహితురాలైన కీర్తిని కూడా ఇందులోకి దింపినట్టు తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు.