2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న వైసీపీ నాలుగేళ్ల పాలన తర్వాత తొలిసారిగా పార్టీపరంగా అసంతృప్తులను బుజ్జగించాల్సిన రక్షణాత్మక వైఖరిని ప్రస్తుతం అనుసరిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకగాలులు వీస్తున్నాయన్న ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉధృతరూపం దాల్చకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి తమసత్తా చాటేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. పదిరోజుల వ్యవధిలో ఆయన రెండుసార్లు ఢిల్లీకి పయనమవడం కూడా ఇందుకేనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలతో మారిన రాజకీయ ముఖచిత్రం
ఆ పార్టీ తరపున నరసాపురం నుంచి ఎంపీగా ఎన్నికై ఆ తర్వాత రెబెల్గా మారిన కనుమూరి రఘురామకృష్ణంరాజును మినహాయిస్తే కొన్నిరోజుల క్రితందాకా అసలు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అధిష్ఠానాన్ని ఎదిరించే సాహసం ఎవరికీ కలలో కూడా ఊహకందని విషయం. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు తర్వాత ఈ పరిస్థితి మారినట్టే కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ద్వారా టీడీపీ ఒకసీటును గెలుచుకోవడం దీనినే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ మరో అభ్యర్థిని నిలిపినా గెలిచి ఉండేవారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు వారి మైండ్ గేమ్నే సూచిస్తున్నా జరిగిన పరిణామాలు వైసీపీలో ప్రకంపనలు పుట్టించాయన్నది నిజం. ఆ కారణంగానే క్రాస్ ఓటింగ్ చేశారని అనుమానం ఉన్న నలుగురు ఎమ్మెల్యేలపై పార్టీ వేటు వేసింది. కాగా వేటుపడిన నలుగురిలో ఇద్దరు వైసీపీ అధిష్ఠానంపై బహిరంగంగా కొన్నిరోజులుగా బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. వీరు పార్టీకి వ్యతిరేకంగానే ఓటు వేసే అవకాశం ఉందని వైసీపీ కూడా ముందుగానే భావించింది. అయితే ఆ పార్టీకి కూడా ఊహకందని విధంగా మరో రెండు ఓట్లు కూడా టీడీపీ వైపే పడి ఆ పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరించాయి.
ఈనేపథ్యంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కూడా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారంటూ వైసీపీ అధిష్ఠానం వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈ చర్యతో సమస్య పరిష్కారం కాకపోగా ఆ పార్టీలో మరింత ఉక్కపోతకు దారితీసింది. మరింతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్న చర్చకు తెరలేచింది.
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముందస్తు ఎన్నికలకు అనుమతి కోసమేనా..?
కాగా సీఎం జగన్ పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీ టూర్ పెట్టుకోవడం పైనా రాజకీయవర్గాల్లో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం గట్టిగా నమ్ముకున్న సంక్షేమ పథకాల అమలు రోజురోజుకు సవాలుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన నిధులు కోరడంతోపాటు, ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు అనుమతి కోరేందుకు కూడా తెరవెనుక గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్టు రాజకీయవర్గాల్లో అంతర్గతంగా చర్చ నడుస్తోంది.