కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో దేశ రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసిన పరిణామమిది. కమ్యూనిస్టు పార్టీలతోపాటు బీజేపీకి కాంగ్రెస్కు సమానదూరం పాటిస్తామని చెప్పే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖ నాయకులు రాహుల్గాంధీకి మద్దతు ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే రాహుల్గాంధీతో పాటు జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్కు అండగా నిలిచారు.
ఇక రాహుల్గాంధీ ఎంపీగా తాను ఉంటున్న బంగ్లాను ఖాళీ చేయాలని లోక్సభ సెక్రటేరియట్ చెప్పిన నేపథ్యంలో రాహుల్ గాంధీకి తన అధికారిక నివాసాన్ని ఆఫర్ చేశారు కాంగ్రెస్ పార్టీకే చెందిన మల్కాజ్గిరి ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి. రాహుల్గాంధీని తన నివాసానికి ఆహ్వానించారు. రాహుల్ భయ్యా.. నా ఇల్లు, మీ ఇల్లే అంటూ ట్వీట్ చేశారు. తన ఇంట్లో నివాసం ఉండాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. తాము అందరం ఒకే కుటుంబ సభ్యులమని వ్యాఖ్యానించారు.
కాగా రాహుల్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని కూడా లోక్సభ సెక్రటేరియట్ నోటీసులు పంపించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాహుల్గాంధీ సైతం తాను నిబంధనలకు అనుగుణంగా నడుచుకునేందుకు ఎప్పుడూ సిద్ధమేనని, నాలుగుసార్లు ఎంపీగా పనిచేసిన తనకు ఇప్పటిదాకా ఉన్న ఇంటితో ప్రత్యేకమైన అనుబంధం ఉందని లోక్సభ సెక్రెటేరియట్ డిప్యూటీ సెక్రెటరీ డాక్టర్ మోహిత్ రాజన్కు ప్రత్యుత్తరమిచ్చారు.