తెలంగాణలోని కాళేశ్వరం, దాని అనుసంధానంగా నిర్మించిన ప్రాజెక్టులో డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నట్టు విజిలెన్స్ రిపోర్టు బట్టబయలు చేసిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాగ్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు తీసుకొంటామని బీఆర్ ఎస్ పార్టీ నేతలను హెచ్చరించారు.
అసెంబ్లీలో కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ సహా ఇతర ప్రాజెక్టులపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులు, రాష్ట్ర ప్రజలకు వివరించారు. అన్నారం బ్యారేజీలో శుక్రవారం నుంచి లీకులు మొదలయ్యాయని ఆరోపించారు మంత్రి. నిర్మాణం తర్వాత కనీసం ఇన్స్ఫెక్షన్ కూడా లేకుండా ప్రారంభించారని మండిపడ్డారు. అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అస్సలు నీరు నింపొద్దని ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చినట్లు ఉత్తమ్ చెప్పారు.