వాణిజ్య నగరంగా పేరొందిన రాజమహేంద్రవరం భూమాఫియా ఆగడాలు పెట్రేగిపోతున్నాయ్. నకిలీ పత్రాలు సృష్టించి ఆన్ లైన్ లో భూ రికార్డులను మార్చేస్తున్నారు.
తాజాగా ఏవీ అప్పారావు రోడ్, వెంకటేశ్వర్ నగర్, తిలక్ రోడ్ ప్రాంతాలలో భూ రికార్డులు మార్చిన ఘటనలు వెలుగులోకి రావడంతో రాజమండ్రి వాసులు ఆందోళన చెందుతున్నారు. సర్వే నెంబర్ 201 లో కొన్ని సబ్ డివిజన్లలో భూ యజమానులు పేర్లు మార్చి .. ఎం. శైలజ అనే పేరును ఆన్ లైన్లో చేర్చడంతో అక్రమాలు బయటపడ్డాయి. అర్బన్ తహశీల్ దార్ కి ఫిర్యాదు చేసినా ఆయన నిమ్మకునీరెత్తినట్లు మిన్నకున్నారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 8 చోట్ల ఆస్తులు పేర్లు మారిపోయాయి. సదరు ఆస్తులు యజమానులు ఆధీనంలోనే ఉన్నా రికార్డులలో మాత్రం మారిపోయాయి. వెంకటేశ్వర నగర్ ప్రాంతంలో సినీ హీరో తరుణ్ తల్లి, సినీ నటి రోజా రమణి కి చెందిన 10 కోట్ల విలువైన రెండు ఎకరాలు భూమిని నకిలీ వీలునామాతో కాజేశారు. దీనిపై అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇప్పటికీ న్యాయ0 జరగలేదు.
ఇటీవల పేక్ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ పై ఉన్నతాధికారులకు వెళ్లిన ఫిర్యాదుపై విచారణ జరగనుంది.
సబ్ రిజిస్ట్రార్ల అక్రమాలు: రాజమండ్రిలో భూ మాఫియా ఆగడాలకు కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు సహకరిస్తున్నారు. గతంలో రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏకంగా కొన్ని దస్త్రాలు మాయం చేసిన కేసును .. ఆ శాఖ ఉన్నతాధికారులు ఇంకా తేల్చకుండానే ఉన్నారు.