తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. వందల కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తున్నా తెలంగాణ ఎడారిగా ఉండేది. గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమం ధనయజ్ఞం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రాంతం గర్జించిందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు కేటీఆర్.
రేవంత్ సర్కారు కూడా అదే తీరులో సాగుతోంది. మేడిగడ్డపై దుష్ప్రచారం చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ లో మొత్తం 84 పిల్లర్లు ఉండగా కేవలం 3పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు మాత్రం మొత్తం బ్యారేజ్ కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రజలకు వాస్తవాలు చూపించేందుకు బీఆర్ఎస్ తరఫున ప్రయత్నిస్తాం.. మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రతినిధులతో మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామని కేటీఆర్ అన్నారు.