మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’ ప్రచారంలో భాగంగా కట్టుపల్లికి వెళ్లారు. టీడీపీ నేతలు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ కార్యకర్తలు బల్లి వెంకటయ్య, సాయి, అంకయ్య, అయ్యప్ప వాటిని చించేశారు. దీంతో టీడీపీ నేతలు మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని కూడా చింపేయడంతో ఇదేంటని ప్రశ్నించిన వారిని దుర్భాషలాడారు.
ఇంతలో సోమిరెడ్డి గ్రామానికి వరావడంతో టపాసులు కాలుస్తూ స్వాగతించిన టీడీపీ స్థానిక నాయకులతో వెంకటయ్య వాగ్వాదానికి దిగాడు. నేతలు అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంకటయ్య కాసేపటికి గునపంతో వచ్చి సోమిరెడ్డిపై దాడికి యత్నించాడు. గొడవ పెరుగుతుండడంతో సోమిరెడ్డితో పాటు ఇతర నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్థానిక టీడీపీ నేత మహేంద్ర ఇంటికి వెళ్లి వెంకటయ్య బృందం దాడి చేసింది. ఇంటి కిటికీలు పగలకొట్టి, కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలపైనా వెంకటయ్య బృందం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.