అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న కేసీఆర్ … తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు కకావికలం అవుతున్నారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలో ధీటుగా ఎదుర్కోలేకపోయినా.. కనీసం ఉనికిని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే రాబోయే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లు కనిపిస్తోంది. బీజేపీతో ఎన్నికలకు వెళ్లడం కెసిఆర్ కి ఇటీవల వరకు ఇష్టం లేదు. అయితే మారుతున్న రాజకీయ పరిస్థితులకు ఆందోళన చెందుతున్న బీఆర్ఎస్ నేతలు .. ఎలక్షన్స్ పేస్ చేయాలంటే బీజేపీ సహకారం తప్పనిసరంటూ పొత్తుపై కేసీఆర్ పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ నేతలు ఆందోళన నేపథ్యంలో కెసిఆర్ సైతం బీజేపీతో పొత్తుకు వెళ్లడమే శరణ్యం అని భావిస్తున్నారు.
ఈ మేరకు తెలంగాణలో 17 లోక్ సభ సీట్లలో చెరి సగం పోటీ చేయడానికి ఒప్పంద ప్రతిపాదనను బీజేపీ పెద్దల వద్ద ఉంచారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం బీఆర్ఎస్ తో పొత్తుపై ఇంకా ఏ విషయం తేల్చలేదు. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తో బీజేపీ త్రిముఖ పోరులోకి దిగితే… బీఆర్ఎస్ ఉనికి కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే పలు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయ్. ఈ నివేదికలతోనే బీజేపీ సైతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికలో బీఆర్ఎస్ ను చాప చుట్టేస్తే.. వచ్చే దఫా కాంగ్రెస్ తో ముఖా ముఖి తలపడి 2028-29 అసెంబ్లీ ఎన్నికలో తెలంగాణలో జెండా పాతవచ్చన్న ఆశలతో బీజేపీ ఎత్తుగడ కనిపిస్తోంది. అయితే మోడీ మూడో దఫా ప్రధాని పదవిని చేపట్టబోయే ప్రతిష్టాకర ఎన్నికలు కావడంతో ఈ దఫా బీఆర్ఎస్ తో కలసి వెళితే బాగుంటుందని తెలంగాణ బీజేపీ కీలక నేతలు మోడీ, అమిత్ షా దృష్టికి తెచ్చినట్లు చెపుతున్నారు. దీనిపై కూడా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది. అయితే బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుల అంశం ఈ నెలాఖరుకి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.