తెలుగుదేశం-జనసేన కూటమితో భారతీయ జనతా పార్టీ పొత్తు అంశంపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు టీడీపీ-బీజేపీ పెద్దలు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఈ నెల 25 వ తేదీ నాటికి ఇరు పార్టీ అధిష్టానాలు నుంచి ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.
పొత్తులో భాగంగా బీజేపీకి హిందూపురం, తిరుపతి, ఏలూరు, విశాఖపట్నం పార్లమెంట్ స్థానాలు కేటాయించినట్లు సమాచారం.
హిందూపురం నుంచి శ్రీ పీఠం స్వామి పరిపూర్ణానంద, తిరుపతి నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ, ఏలూరు పార్లమెంట్ నుంచి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, విశాఖపట్నం నుంచి జీవిఎల్ నరసింహారావు లేదా మరో కీలక నేత.. బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు.
వీరిలో హిందూపురం నుంచి పరిపూర్ణానంద, ఏలూరు నుంచి గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన ఫౌండేషన్ ఫౌండర్) మూడేళ్ళుగా .. బీజేపీని జనంలోకి తీసుకువెళుతున్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో గారపాటి చౌదరి, మోడీ పదేళ్ల పాలనా కాలంలో సాధించిన అద్భుత విజయాలు, కేంద్ర పధకాలు, ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు, పథకాలపై ఫ్లెక్స్ లతో విశేషమైన ప్రసారం చేపట్టి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు.
8 అసెంబ్లీ సీట్లు: బీజేపీ పొత్తులో భాగంగా 175 అసెంబ్లీ సీట్లలో జనసేనకు సుమారు 30, బీజేపీకి 8 స్థానాల అంగీకారానికి వచ్చినట్లు ఆయా పార్టీల ఆంతరంగిక చర్చలలో తెలుస్తోంది. ఏయే అసెంబ్లీ సీట్లు బీజేపీకి, ఏ సీట్లు జనసేనకు , తెలుగుదేశం పోటీ చేయబోయే అసెంబ్లీ సీట్లు ఏవీ.. అనే దానిపై కూడా ఈ నెలాఖరు నాటికి క్లారిటీ రానుంది.