ఉద్యోగం కోసం పదిహేనేళ్లుగా పోరాడుతున్నామని డీఎస్సీ 2008 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామన్ మెరిట్ లో ఎంపికైనా తమకు ఉద్యోగాలు దక్కలేదని వాపోయారు. కోర్టు తీర్పు ఇచ్చినా సరే గత ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా తమకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు వారంతా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేయాలని డీఎస్సీ 2008 అభ్యర్థులు హైదరాబాద్ చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్దకు భారీగా చేరుకుని, ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన పర్సనల్ సెక్రటరీని కలిసి వినతిపత్రం అందజేశారు.
డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం కామన్ మెరిట్ లో తాము అర్హత సాధించామని.. అప్పటి ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై పదిహేనేళ్లుగా పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.