మేడారంలో వింత చోటుచేసుకుంది. అక్కడ రెండేళ్లకు ఒకసారి వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభంగా జరుగుతుంది. వనదేవతలకు భక్తులు బంగారం(బెల్లం)తో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అయితే హనుమకొండకు చెందిన భిక్షపతి, జ్యోతి దంపతులు మాత్రం తమ పెంపుడు కుక్క ఆరోగ్యం బాగుండాలని మొక్కుకున్నారు. పెంపుడు కుక్కకు తులాభారం వేసి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకుని మొక్కుతీర్చుకున్నారు.
పెంపుడు కుక్క ‘లియో’ గతేడాది అనారోగ్యం పాలైంది. వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ కుటుంబం సమ్మక్క సారలమ్మకు మొక్కుకుంది. తర్వాత రెండు రోజులకు లియో ఆరోగ్యం కుదుటపడిందని, అందుకేమొక్కు చెల్లించుకున్నట్లు ఆ దంపతులు తెలిపారు.