బాబాయ్ హత్య కేసులో జగన్ ఇరుక్కుంటారా? పాత్రధారులుగా సీబీఐ గుర్తించిన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో హత్యకు సూత్రధారులను కూడా సీబీఐ బయటపెట్టే ఛాన్స్ ఉందా? జగన్ కి తెలియకుండా ఈ హత్య జరగదు..అని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన ఆరోపణలు.. వీటన్నిటినీ పరిశీలిస్తుంటే.. సీబీఐ పై కేంద్ర పెద్దల ఒత్తిడి లేకపోతె ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి కూడా ఈ కేసులో ఇరుక్కునే ప్రమాదం పొంచి ఉందా?
వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. తాను దగ్గరుండి చూసినట్లు ”వివేకానంద రెడ్డి గుండె పోటుతో మరణించారు…” అని ప్రకటించారు. సీబీఐ అధికారులు విజయసాయిని కూడా విచారించాల్సిన అవసరం ఉన్నా.. అప్పట్లో ఎందుకో వదిలేసారు.
వివేకా హత్యపై ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సైతం.. చంద్రబాబు అండ్ కో ఈ హత్య చేయించారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. ”నారా సుర రక్త చరిత్ర” శీర్షికతో సాక్షి పత్రికలో పతాక శీర్షికన భారీ కధనాలు రాయించారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్… సీఎం అయ్యాక.. సీబీఐ విచారణ వద్దన్నారు. ఈ పరిణామాలు పులివెందుల వాసులే కాదు.. రాష్ట్రం అంతటా గమనించారు. అయితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ద్వయం జగన్ కి అండగా ఉండటంతో ఈ కేసు ఇన్నాళ్లు జాప్యం అవుతోందన్న ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి.
వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఆదివారం తెల్లవారుజామున అధికారులు రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసు సీన్ పూర్తిగా మారిపోయింది. సీబీఐ దూకుడు గమనిస్తే…ఇక సీబీఐ అధికారులు వరుస అరెస్టుల పర్వం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు 4సార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న అవినాష్రెడ్డి ఇంటికి సీబీఐ బృందం వెళ్లింది.వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తోంది. తాజాగా ఈ కేసులో పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతని రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలను అధికారులు ప్రస్తావించారు. ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలు తారుమారు చేశారని సీబీఐ పేర్కొంది. సీబీఐ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన విషయాలు.. ‘‘హత్య తర్వాత అవినాష్ రెడ్డి ఇంటికి ఉదయ్ కుమార్ రెడ్డి వెళ్ళాడు. గూగుల్ టెక్ ఔట్ లొకేషన్లో కూడా ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు తేలింది. తన తండ్రి ప్రకాష్ రెడ్డితో వివేకా మృతదేహానికి కుట్లు వేయించారు. అవినాష్ రెడ్డితో ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటాడు.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే… ఈ అరెస్టుల పర్వం అవినాష్ రెడ్డితో ఆగుతుందన్న విశ్లేషణాలు వస్తున్నాయ్. బాబాయ్ హత్య విషయం జగన్ కి, ఆయన సతీమణి భారతికి ముందే తెలుసో లేదో ఆ దేవుడికే తెలియాలి.