” వైసీపీ అరాచకాలను ఎదుర్కోలేమేమోనని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఇపుడిపుడే ప్రజా వ్యతిరేఖత ఎదుర్కొంటున్న బీజేపీతో చేతులు కలిపేందుకు తహతహలాడుతున్నారు. విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేయడానికి కంకణం కట్టుకున్న మోదీ సర్కార్ పై ఉత్తరాంధ్రలో తీవ్ర వ్యతిరేఖత ఉంది. బీజేపీ పట్ల మెజార్టీ ముస్లిం కమ్యూనిటీ వ్యతిరేకంగా ఉండటం మామూలే. నెల్లూరు, గుంటూరు, రాయలసీమ జిల్లాలలో ముస్లిం ఓట్ల ప్రభావం అధికంగా ఉంటుంది. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే.. ఉత్తరాంధ్ర, రాయలసీమలలో పెద్ద నష్టమే జరగవచ్చు…” ఈ విశ్లేషణ తెలుగుదేశం పెద్దలకు తెలియక కాదు. వాళ్ళతో కలవకుండా ఉంటే ఎన్నికలలో వైసీపీ చేసే అరాచకాలకు నిలబడలేమేమోనన్న భయం..
ఇటీవల పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కమలం పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. తెలంగాణలోనూ అదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం నుంచి బీజేపీ బయటపడేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో తమకు చంద్రబాబు సహకారం ఉంటే అధికారానికి కొంత సులువవుతున్నదనేది బీజేపీ ముఖ్యల నమ్మకం. ఈ కారణంతోనే చంద్రబాబును ఢిల్లీకి రమ్మని కబురుపెట్టినట్లున్నారు. అమిత్ షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా లతో చంద్రబాబు గంట సేపు సమావేశమయ్యారు. పొత్తులపై చర్చించుకున్నారు. తర్వాత ప్రధాని మోదీతో కూడా చంద్రా బాబు కలవనున్నారు.
”టీడీపీని దెబ్బ కొట్టడానికే చంద్రబాబుకి ఢిల్లీ ఆహ్వనం ”
జగన్ కే మోదీ అండ... ఎట్టి పరిస్థితులలోనూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ల అండదండలు జగన్ మోహన్ రెడ్డికే ఉంటాయి. చంద్రబాబు నాయుడిని బీజేపీ నమ్మే పరిస్థితిలో లేదు. ప్రస్తుతం రాజకీయంగా బీజేపీ కాస్త ఎదురీదుతున్న తరుణంలో తెలంగాణలో తెలుగుదేశం సహకారం అవసరమనే ఒకే ఒక కారణంతోనే చంద్రబాబుతో తాత్కాలిక స్నేహం కోరుకుంటున్నారు. బీజేపీతో కలిస్తే అది చంద్రబాబుకి దృతరాష్ట్ర కౌగిలే అవుతుంది…
ఒంటరిగా వెళితేనే ‘టీడీపీ’కి మేలు.. జనసేన, బీజేపీలతో పొత్తుతో వెళితే తెలుగుదేశం పార్టీకి నష్టమే జరుగుతుంది. బీజేపీని వదిలి.. పవన్ తో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ లో మెజార్టీ నేతలు ఆశ పడుతున్నారు. జనసేనలో పొత్తు ఉన్నా… మెజార్టీ బీసీ కులాలు తెలుగుదేశం వైపు వస్తాయని భావించలేం. బీజేపీతో స్నేహం అంటే… ముస్లింలు ఎలాగూ దూరంగానే ఉంటారు. అదే బీజేపీ అండదండలతో వైసీపీ ఉన్నా.. ఆ పార్టీకి మాత్రం ముస్లింలు దూరంగా జరగరు. ఇది చంద్రబాబుకి, టీడీపీకి ఓ రకంగా శాపం అనే చెప్పాలి. ఏదైతే అదే అవుతుందని.. చంద్రబాబు ధైర్యంగా ఒంటరిగా పోటీకి దిగి.. రాష్ట్రాన్ని, మీ తర్వాత తరాల వారి భవిష్యత్తును రక్షించాలంటే.. నా అవసరం ఉందని మీరు భావిస్తే.. టీడీపీకి అండగా ఉండండి…. అంటూ మొండిగా ఉంటేనే మళ్ళీ అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప.. వాళ్లతో కాళ్ళ బేరానికి వెళ్లినంత మాత్రాన గెలుస్తామనుకుంటే అది భ్రమే అవుతుంది.