ఎన్నో యుగాలుగా సారవంతంగా ఉన్న భూమిని మనం కేవలం వందేళ్లలోనే సర్వ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న రీతిలో వ్యవహరిస్తున్నాం. వేదం, సనాతన ధర్మం, మహర్షులు చెపుతున్న ‘పంచభూతాలు’ (భూమి , నీరు, ఆకాశం, అగ్ని, గాలి)కేవలం ప్రకృతి పదార్థాలే కాదు. మానవ జీవితాలకు మూలాధారాలు. మనమే కాదు.. తర్వాతి తరాలవారూ ఈ భూమ్మీద మనుగడ సాగించాలంటే .. వ్యవసాయ భూసారాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపైనా ఉందన్న అంశాన్ని గుర్తుంచుకోవాలి.
” మన దగ్గర ఎంత సంపద ఉన్నా, ఎన్ని విద్యార్హతలు ఉన్నా కానీ మనం నీటిని, మట్టిని సంరక్షించుకోకపోతే మన పిల్లలకు చక్కటి భవిష్యత్తు ఇవ్వలేం.. నేను శాస్త్రవేత్తను కాదు. పర్యావరణవేత్తను కాదు. నేను భూమికి చెందిన వాడిని. అందుకే భూమికి జరగబోయే పెను విపత్తు నాకు తెలుసు. భూసారాన్ని కాపాడుకునేందుకు “సేవ్ సాయిల్” ఉద్యమం ద్వారా ముందుకు వెళదామని అనేకమంది రాజకేయ నాయకులు, సైంటిస్టులు, యువకులు, విద్యార్థులు, పాలకులు.. ఇలా అందరినీ కోరుతున్నాను.” అని సద్గురు జగ్గీ వాసుదేవ్ ‘మట్టి వినాశన సంక్షోభాన్ని’ నివారించేందుకు ఒంటరిగా చేపట్టిన ‘save soil ‘ యాత్ర ఓ కీలక ఘట్టం కావాలి.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం భూమి వ్యవసాయ యోగ్యం కాకుండా పోయిందని, రాబోయే 50 ఏళ్లలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందని సద్గురు ఆందోళన చెందుతున్నారు.
“concious planet “ నినాదంతో 65 ఏళ్ల వయసులో 30 వేల కిలోమీటర్లు బైక్ పై ప్రయాణిస్తూ..శరవేగంగా క్షీణిస్తున్న భూసారాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నారు “ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ యోగ్యమైన భూమి వేగంగా సారం కోల్పోతుంది. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదికలు కలవరపరుస్తున్నాయి. సాగు భూముల్లో 3- 6 శాతం ఉండాల్సిన సేంద్రియ కర్బనం (ఆర్గానిక్ కార్బన్) 0.5 శాతానికి పడిపోయిందని.. ఈ దుస్థితి ఆగకపోతే మరో నలభై, ఏభై ఏళ్లలో భూసారం పూర్తిగా కోల్పోయి.. కరవు కాటకాలు తాండవిస్తాయి. ఈ దుర్భర స్థితి రాకుండా మన తర్వాత తరాల వారు భూగ్రహంపై మనుగడ సాగించాలంటే మనం మేల్కోక తప్పదు. “భూసారాన్ని కాపాడుకుందాం..” అనే ఈ ఉద్యమం ద్వారా ఈ విపత్తును కొంత వరకైనా నిలువరించాలని సద్గురు చేస్తున్న ఈ భూసార పరిరక్షణ యజ్ఞంలో మనమూ భాగస్వాములవుదాం. భూమికి మనం చేస్తున్న నష్టాన్ని కొంతైనా ఆపుదాం. మన వారందరికి అవగాహన కలిగిద్దాం. లేకపోతే భావి తరాలకు మనం తీవ్రమైన అన్యాయం చేసినవారమే అవుతాం. సద్గురు చేపట్టిన ఈ ప్రపంచ యాత్రలో భూసారాన్ని కాపాడుకోవాలన్న స్పృహ ఎంత మందిలో వస్తుందో కానీ, సాగుభూములలో సారాన్ని కాపాడుకునేందుకు మన వంతు ప్రయత్నం మొదలుపెడదాం.. ఈ రోజు నుంచే.
(ఈనెల 21న జాతీయ మృత్తికా దినోత్సవం)