”జగన్ అడ్డా పులివెందులలో సైతం ఊహించని రీతిలో టీడీపీ గెలుపుతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇక తిరుగులేదంటూ టీడీపీ కేడర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో హుషారుగా ఉంది...”
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సాధించిన అప్రతిహత గెలుపుతో ఆ పార్టీ కేడర్ కదం తొక్కుతోంది. అయితే ఓటమిని అంత తేలిగ్గా తీసుకొని సీఎం జగన్.. రాబోయే ఎన్నికలకు ఎలా సమాయత్తమవ్వాలి.. అనేదాని కోసం మరింత అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది. ఈ గెలుపు జోష్ తో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా చేసుకోవాల్సిన సర్దుబాట్లను నిర్లక్ష్యం చేయకూడదు. వైఎస్ కుటుంబం కలలో కూడా ఊహించని పులివెందులలో ఓటమి వైసీపీని, ఆ పార్టీ అధినేతను మరింత కుంగతీస్తోంది. ”జనానికి పప్పు బెల్లాల్లా పంచుతున్నాం.. మనకు డోకా లేదు.. ”అని జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళూ ధీమాగా రాజకీయాలను నడుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలను శత్రువులుగా భావిస్తూ .. తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కోర్టు తీర్పులను సైతం ధిక్కరిస్తూ నియంత మాదిరి వ్యవహరిస్తున్నారు. ఇసుక, మద్యం, గనుల దోపిడీ.. ఇవన్నీ సామాన్యుడు ఏం పట్టించుకుంటాడనుకుంటూ యదేచ్చగా దోచుకుంటున్నారు. సోషల్ మీడియాతో నెట్టుకొచ్చారు : జగన్ తన పాలనపై లేనిపోని గొప్పలు ప్రచారం చేసుకోవడానికి, ప్రత్యర్థి పార్టీలు, ప్రజా సంఘాల నేతలపై దుష్ప్రచారం చేయిస్తూ ఇన్నాళ్ళూ పబ్బం గడుపుకున్నారు. ప్రజలలో భ్రమలు కల్పించడానికి సోషల్ మీడియాకి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ.. వచ్చారు. విద్యావంతులు వాటిని తిప్పికొట్టారు. ఇక జగన్ ఇపుడు పూర్తిగా ఆర్ధికంగా ప్రలోభ పెట్టడం ద్వారా అధికారం నిలబెట్టుకోవాలన్న దానిపైనే ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేడర్ ని ఉపయోగించుకోవాలి: చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు రాష్ట్రానికి చేసిన మేలు, ఐటీ వంటివాటిపై టీడీపీ కేడర్ జనానికి అర్ధం అయ్యే రీతిలో వివరిస్తూ ఉండాలి. వైసీపీ పాలనలో రాష్టానికి జరిగిన నష్టాన్ని చెప్పాలి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో భూముల ధరలు పెరగడానికి ఏపీలో జగన్ పాలనే అంటున్న ఆ రాష్ట్ర మంత్రుల వ్యాఖ్యలను వివరించాలి. ఇపుడు జగన్ ఇస్తున్న ఉచితాలను ఆశ పడితే భవిష్యత్తులో యువతకు జరిగే నష్టాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. మధ్య నిషేధం, ఉద్యోగులకు సీపీఎస్ వంటి హామీలు, అమరావతి రాజధానిగా ఉంచుతామని చెప్పి, విశాఖకు మార్చడం వల్ల రాయలసీమ వాళ్లకి దూరాభారం వంటివాటిపైనా అవగాహనా పెంచుతూ ఉండాలి. ఇవన్నీ తెలియచేయడానికి టీడీపీ కేడర్ నిత్యం జనంతో మమేకమవ్వాలి. ఇందుకోసం పార్టీ అధినాయకత్యం మరింత ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. జగన్ తో పోలిస్తే ఆర్ధికంగా తూగే పరిస్థితి టీడీపీ కి లేదు. దీనిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
భజన మీడియాతో బీ కేర్ ఫుల్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖచ్చితంగా ఆ పార్టీ కేడర్ కి స్ఫూర్తి నిచ్చేదే.. అయితే ఆంధ్రజ్యోతి, ABN, టివీ-5 వంటి కొన్ని మీడియాలు ఇక టీడీపీ 2024లో గెలిచేసినట్లే.. అంటూ ఊదరగొట్టేస్తున్నాయ్. ఇది ముమ్మాటికీ టీడీపీ కి తీవ్రమైన నష్టం తెచ్చేదే. 2019 సార్వత్రిక ఎన్నికలలో కూడా సదరు మీడియా సంస్థలే టీడీపీ ఘోర ఓటమికి కారణాలయ్యాయ్.. అన్న విషయాన్ని తెలుగుదేశం పెద్దలు మర్చిపోకూడదు.