ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు వారు చెపుతున్న కారణాలు సహేతుకంగానే కనిపిస్తున్నాయి. అటు ఉత్తరాంధ్రతో పాటు ఎవరికీ ఊహకందని రీతిలో తూర్పు పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. విపక్ష నేతలే కాదు సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ ఫలితాలను ఊహించలేదు. ఇక ఈ ఫలితాలను అధికార పార్టీ అంత త్వరగా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.
ప్రతిపక్షానికి ఊపిరి అందించిన పట్టభద్రులు..
నిజానికి ప్రజల్లో ప్రభుత్వంపై నెలకొన్న అసంతృప్తి, వ్యతిరేకత ఏస్థాయిలో ఉన్నాయో గమనించి తమ పోరాటాల ద్వారా వాటిని బహిరంగంగా వెల్లడయ్యేలా చేయాల్సిన బాధ్యత విపక్షానిది. కానీ ఇప్పటిదాకా ఏపీలో ఆ బాధ్యతను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సమర్థవంతంగా నిర్వహించిందా అంటే ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ చేస్తున్న యాత్రలకు ప్రజలనుంచి విశేష ప్రజాదరణ లభిస్తున్న విషయం వాస్తవమే. అయితే ఆ స్థాయిలో టీడీపీ క్యాడర్ ను ఉత్సాహంగా నడిపించడంలో స్థానిక నాయకత్వం చురుకైన పాత్రను పోషిస్తున్న నియోజకవర్గాలు పరిమితమే. ఇందుకు పలు కారణాలున్నాయి. అధికార పార్టీ నిర్బంధాలతోపాటు ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఏమేరకు ఉందో ఎవరికీ అంచనా లేకపోవడమే. అందుకే విపక్షం పాత్రను ఇప్పుడు పట్టభద్రులు నిర్వహించినట్టుగా ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకరకంగా విపక్షానికి పట్టభద్రులు ఊపిరి పోశారు. దిశానిర్దేశం చేశారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమపై పెట్టుకున్న ఆశలు గల్లంతు..
అమరావతి రాజధానిగా ఉండడానికి వ్యతిరేకిస్తూ విశాఖకు పాలనా రాజధానిని మారుస్తామని వైసీపీ ప్రభుత్వం చెపుతూ వచ్చింది. తద్వారా ఉత్తరాంధ్రలో తనకు సానుకూలత ఏర్పడుతుందని, ఇక రాయలసీమ ఎలాగూ తనకు కంచుకోటేనని భావించింది. అయితే అధికార పార్టీ అంచనాలు ఘోరంగా తప్పాయి. ఈ రెండు ప్రాంతాల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత తేటతెల్లమైంది. సాక్షాత్తూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలోనూ వైసీపీ అభ్యర్థికంటే రెట్టింపు సంఖ్యలో ఓట్లు రావడంతో వైసీపీకి దిక్కుతోచని పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు ఈ ఫలితాలపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేసినా వాటివెనుక వారిలో బేలతనమే కనిపిస్తోందని చెప్పాలి.
ఇవే అసలు రిఫరెండం.
నిజానికి కొన్నేళ్లుగా పొలిటికల్ సర్వేలంటూ రావడం సర్వసాధారణంగా మారింది. వాటి విశ్వసనీయత ఏపాటిదో ఎవరూ చెప్పలేని పరిస్థితి. వారు తీసుకునే శాంపిల్స్ కూడా ఎంతమందిననేది నమ్మలేం. కానీ ప్రస్తుతం మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు కలిపి 9 జిల్లాల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాలను రిప్రజెంట్ చేశాయి. వీటిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు సృష్టంగా కనపడింది. ఒక అసెంబ్లీ నియోజక వర్గానికి తక్కువలో 3 వేల ఓట్లు చూసుకున్న 108 అసెంబ్లీ నియోజక వర్గాలలో ఓటింగ్ తీరును బట్టబయలు చేసినట్టేననుకోవాలి. ఇవి మొత్తం రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో 66 శాతానికి సమానం. ఇక మిగిలిన జిల్లాల్లో అమరావతి రాజధాని అంశం మరింత ఎక్కువ ప్రభావం చూపడం ఖాయం. అంటే ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టేననుకోవాలి.
వలసలను అడ్డుకోవడం అధికార పార్టీకి సవాల్
ఈ ఫలితాలు ఆధారం చేసుకుని చూస్తే ఇక అధికార పార్టీ నుంచి విపక్షం వైపు వలసలు భారీగానే మొదలవుతాయని ఊహించవచ్చు. వీటిని అడ్డుకోవడం ఆ పార్టీకి తలకు మించిన పనే. స్థానికంగా బలమైన నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం ప్రజాదరణ ఉంటుందని భావించిన పార్టీ వైపు చూడటం ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధారణం. ఒకవేళ ఇదే జరిగితే విపక్షం సహజంగానే మరింత బలం పుంజుకునే అవకాశముంది. ఇక విపక్షాల పొత్తుల అంశాన్ని ఈ ఫలితాలు ప్రభావితం చేయనున్నాయి.