పది నిజాలు చెప్పి.. ఒక అబద్దాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తే… ఆ పది నిజాలను సైతం నమ్మకుండా పోతారని గుర్తించుకోవాలి ఆర్కే గారూ..
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం చేస్తున్న పాలనపై ఓ వర్గం మీడియా.. ముక్యంగా ఆంధ్రజ్యోతి,-ఏబీఎన్ లలో పుంఖానుపుంఖాలుగా కధనాలు, వస్తున్నాయ్. “వీటిల్లో 70-75 శాతం వాస్తవాలే ఉంటున్నా.. జనంలో మాత్రం అవి ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయ్..” అంటూ టీడీపీ ముఖ్య నేతలే బాహాటంగా చెప్తున్నారు. ఆంధ్రజ్యోతి గ్రూప్ ఎండి వేమూరి రాధాకృష్ణ ఆదివారం ‘కొత్త పలుకు’ పేరుతో రాసే ఆర్టికల్స్ లో మూడొంతులు జగన్ పైనే ఉంటాయి. ఆర్కే రాసే వాటిల్లో చాలా వాస్తవాలే ఉండొచ్చు.. కానీ.. అదే పనిగా జగన్ ని బదనాం చేయడానికే అన్నట్టు రాయడం వల్ల ‘కొత్త పలుకు’ పేజీ క్రమంగా ప్రాధాన్యత కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలలో ఆంధ్రజ్యోతి ఇచ్చిన సర్వే రిపోర్ట్ లు, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబును సమాయత్తం చేయడం వంటి ఆర్కే చేష్టలు టీడీపీకి తీవ్రమైన నష్టం కలిగించాయి.
జగన్ పథకాలు వల్ల ఏపీకి జరుగుతున్న తీవ్రమైన నష్టం గురించి ఆర్కే తాజాగా రాసిన ‘కొత్త పలుకు’లో విశ్లేషించారు. అందులో చాలా వాస్తవం ఉంది. కానీ గతంలో రాసిన అనేక ఆర్టికల్స్ లో బురద చల్లుతూ రాసినవి ఒకటి, అరా ఉన్నాయ్. వాటి ప్రభావం ఆంధ్రజ్యోతి పాఠకులపై బలంగా పడింది. అందుకే పది నిజాలు చెప్పి.. ఒక అబద్దాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తే… ఆ పది నిజాలను సైతం నమ్మకుండా పోతారని గుర్తించుకోవాలి ఆర్కే గారూ.. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ లో జగన్ అక్రమాలపై నిర్బయంగా రాసేది ఆంధ్రజ్యోతి మాత్రమే. అయితే నమ్మకం సన్నగిల్లినపుడు ఎన్ని రాస్తే మాత్రం ఏం ప్రయోజనం నెరవేరుతుంది.
ఆంధ్రజ్యోతిలో ” జగన్ఆ మాయలు ఇంకానా?” శీర్షిక తో ఆర్కే రాసిన కొత్త పలుకు లో కొంత భాగం యధావిధిగా..
“సంక్షేమ పథకాలు ఆపేయాలని, మనం చేస్తున్న ఇలాంటి పాలన వద్దని దుష్ట చతుష్టయం కోరుకుంటోంది’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరికొత్త రాగం అందుకున్నారు. అప్పులు పుట్టక డబ్బులు పంచే కార్యక్రమాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటంతో ఈ సరికొత్త ఎత్తుగడకు ఆయన శ్రీకారం చుట్టినట్టున్నారు. దుష్ట చతుష్టయం అంటే ఎవరెవరో కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తనను కలిసిన తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ వద్ద తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? ఆ అప్పులు చేయడం ఏమిటి? ఆ అవినీతి ఏమిటి? అని ఆరా తీశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నదో కూడా చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శనివారం ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై నివేదిక ఇవ్వడం గమనార్హం. ఇదే సమయంలో ఎస్బీఐ ఒక నివేదికను విడుదల చేసింది. కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు సంక్షేమం పేరిట ఆదాయంలో సింహభాగం ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోతున్నాయని సదరు నివేదికలో హెచ్చరించింది.
అంతకుముందు కొంతమంది ఉన్నతాధికారులు కూడా ప్రధానమంత్రి వద్ద ఇదే తరహా ఆందోళన వ్యక్తంచేశారు. పరిస్థితులు చక్కబడని పక్షంలో శ్రీలంక బాటలోనే ఆయా రాష్ట్రాలు పయనిస్తాయని కూడా పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఈ వాస్తవాలను విస్మరించి దుష్ట చతుష్టయం అంటూ ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన నిందిస్తున్న ‘దుసట చతుసటయం’లో ప్రధానమంత్రి, ఎస్బీఐ, ఆర్బీఐ, కాగ్ కూడా ఉన్నట్టా? తన చేతగానితనం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ముఖ్యమంత్రి ఈ ఎత్తుగడ వేసి ఉంటారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ సరికొత్త ప్రచారానికి తెర తీయడం ద్వారా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కు జగన్ అండ్ కో పాల్పడుతున్నారు. ఇంతకీ జగన్ అమలుచేస్తున్న డబ్బు పంపిణీ కార్యక్రమం సమర్థనీయమా? కాదా? అన్నది తేల్చవలసిన సమయం ఆసన్నమైనది.
ఆకలితో అలమటించే వారిని ఆదుకుంటే సంక్షేమం అవుతుంది. అభివృద్ధిని అటకెక్కించి ప్రజల డబ్బును పంచిపెట్టడం, అదే సమయంలో ఎడా పెడా పన్నులు వేయడం సంక్షేమం ఎలా అవుతుంది? ప్రభుత్వ ఆదాయంలో కొంత మొత్తాన్ని సంక్షేమానికి ఖర్చు చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలా కాకుండా ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవడం కోసం లేదా అధికారం నిలుపుకోవడం కోసం ఆదాయానికి మించి అప్పులు చేస్తూ పంచిపెట్టడం సంక్షేమం ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి తన ఇడుపులపాయ ఎస్టేట్ను అమ్మి లేదా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఉన్న ప్యాలెస్లను, ఇతర బినామీ ఆస్తులను అమ్మి ప్రజలకు పంచిపెడితే కూడా ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఆయనను దానకర్ణుడిగా కీర్తించవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదే! రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పెరుగుతుంటే జగన్ సొంత ఆస్తులు పెంచుకోవడంతోనే తంటా అంతా. ప్రజలు అమాయకులు, తాను ఏం చెప్పినా నమ్ముతారు అని జగన్ బలంగా నమ్ముతారు. అందుకే పథకాలను ఆపాలంటున్నారని ప్రజలను రెచ్చగొడుతున్నారు.
శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభం ఎందుకు వచ్చిందో జగన్రెడ్డికి తెలియదా? అందినకాడికి అప్పు చేస్తూ, పంచిపెడుతూ పోతే ఆ అప్పులను ఎలా తీరుస్తారో చెప్పాలి కదా! జగన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం పెరిగిందా? అంటే అదీ లేదు! 2019కి పూర్వం తలసరి ఆదాయంలో 13 శాతం వరకు పెరుగుదల ఉండేది. ఇప్పుడు ఆ పెరుగుదల 4 శాతానికి పడిపోయింది. అంటే ముఖ్యమంత్రి చెబుతున్న సంక్షేమం వల్ల ప్రజల తలసరి ఆదాయం పెరగడం లేదన్నట్టేగా! ‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నేను ఎవరినీ అడగను. నాకు రావలసింది నాకు వస్తోంది. జనానికి ఇవ్వాల్సింది ఇస్తున్నాను. నా ఓటర్లు నాకున్నారు. ఇంకేం కావాలి’ అని ఇటీవల తనను కలిసిన ఒక వ్యాపారవేత్త వద్ద జగన్రెడ్డి వ్యాఖ్యానించారట. దీన్నిబట్టి ఆయన మనస్తత్వం ఏమిటో అర్థమవుతోంది. రాష్ట్రం ఎటు పోయినా ఫర్వాలేదు, తన ఓటు బ్యాంకు పదిలంగా ఉంటే చాలన్న ధోరణితోనే అప్పులు చేసి మరీ పంచిపెడుతున్నారు. ఇందులో కూడా దగా ఉంది. ఆ విషయం తర్వాత చర్చించుకుందాం. అలవిగాని సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎవరిని పడితే వారిని అందలం ఎక్కిస్తే ఎటువంటి అనర్థం జరుగుతుందో ఇప్పుడు శ్రీలంకలో చూస్తున్నాం. ఆశకు పోయి అధికారాలన్నీ ఒకే కుటుంబానికి కట్టబెట్టడం వల్ల లంకేయులు ఇప్పుడు ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. – ఆర్కే