”వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి కస్టడీకి తీసుకుంటేనే నిజాలు బయటకు వస్తాయ్. ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు…” అంటూ కోర్టులో అఫిడవిట్ వేసిన సీబీఐ …ఆయన్ని అరెస్ట్ చేయడానికి మీనమేషాలు లెక్కిస్తోంది.
వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున జగన్మోహన్రెడ్డి ఆ నలుగురితో సమావేశమైనప్పుడు చిన్నాయన గుండెపోటుతో చనిపోయారని ఇటీవల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకు శీర్షికలో రాసారు. దీనిపై వారం గడచినా జగన్ గానీ, ఆ నలుగురు గానీ నోరు విప్పకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయాలు వాస్తవం కాకాపోతే కనీసం ఖండించలేదు. ఇప్పుడు సీబీఐ అధికారులు ఏం చేయాలి? ఏం జరిగిందని ఆ నలుగురినీ విచారించి ఉండాల్సింది. వారిలో ఒకరిద్దరిని సంప్రందించడానికి సీబీఐ అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారట. ఆ నలుగురినీ విచారిస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దంపతులను కూడా విచారించాల్సి వస్తుంది. బహుశా ఈ కారణంగానే మౌనాన్ని ఆశ్రయించవలసినదిగా సీబీఐకి అదృశ్యశక్తి నుంచి ఆదేశాలు అంది ఉంటాయన్న ప్రచారం తెరపైకి వచ్చింది. అవినాశ్రెడ్డి అరెస్ట్ వ్యవహారం న్యాయస్థానం ఆటంకాలు తొలగిపోయి వారం దాటింది. హైకోర్టులో సీబీఐ అధికారులు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ప్రకారం అవినాశ్రెడ్డిని అరెస్ట్ చేయడం ఎంత అవసరమో చెప్పకనే చెప్పారు. అయినా అవినాష్ అరెస్ట్ విషయంలో సీబీఐ దోబూచులాట మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.