ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ప్రముఖ స్టార్టప్ సంస్థ ఓపెన్ ఏఐ.. తీసుకొచ్చిన చాట్జీపీటీ, దానికి ప్రతిగా గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ నెటిజన్లకు అందుబాటులోకి రావడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. టెక్నాలజీ రంగంపై దాని ప్రభావం మీద చర్చ సాగుతోంది. ఎలన్మస్క్ వంటి వారు కృత్రిమ మేధ (ఏఐ)తో మానవాళి మనుగడకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి ప్రముఖుల్లో ప్రపంచ బిలియనీర్ వారెన్ బఫెట్ జత కలిశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా చేయగలదని, కానీ, మానవుడి ఆలోచన, ప్రవర్తన ఎలా ఉంటుందని కనిపెట్టలేదని తేల్చి చెప్పారు.
వారెన్ బఫెట్ తన సంస్థ బెర్క్షైర్ హాత్వే వార్షిక సమావేశంలో మాట్లాడుతూ తనకు చాట్జీపీటీని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ పరిచయం చేశారని చెప్పారు. దాని సామర్థ్యం తనను ఆశ్చర్య చకితుడ్ని చేయడంతోపాటు దాని పనితీరు ఆందోళనకు గురిచేసిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అణు బాంబు తయారీ వంటిదని వ్యాఖ్యానించారు.
పనులన్నీ ఒక్కరే.. అంటే చాట్జీపీటీ చాట్బోట్ చక్కబెట్టడం ఆందోళనకరం అని వారెన్ బఫెట్ పేర్కొన్నారు. చాట్జీపీటీ వల్ల కొత్తగా కనిపెట్టేదేమీ లేదన్నారు. మంచి పని కోసం ఏదైనా ఆవిష్కరిస్తే.. దాని దుష్ప్రయోజనాలెలా ఉంటాయో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబు ప్రయోగం రుజువు చేసిందని గుర్తు చేశారు. మనం ఏం చేసినా.. ఏది కనిపెట్టినా 200 ఏండ్ల తర్వాత ప్రపంచానికి మేలు చేసేలా ఉండాలి.. ప్రపంచం మొత్తాన్ని ఏఐ మార్చేస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. కానీ మనిషి ఎలా ఆలోచిస్తాడు.. ఎలా ప్రవర్తిస్తాడన్న సంగతి మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టలేదని స్పష్టం చేశారు.