లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన కేంద్ర మాజీ మంత్రి సురేశ్ పచౌరీ, మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.
కాంగ్రెస్ నాయకుడు సురేశ్ పచౌరీని ఆ పార్టీ మూడుసార్లు రాజ్యసభకు పంపింది.1990 నుంచి 96 మధ్య రాజ్యసభ సభ్యుడు, రెండోసారి 1996 నుంచి 2002 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2002 నుండి 2008 వరకు మూడోసారి పెద్దల సభకు పంపింది కాంగ్రెస్ పార్టీ. రెండు సార్లు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.