ప్రజలు విదేశీ వస్తువుల బానిసత్వం నుంచి బయటపడాలి.. విదేశీ వస్తువులపై ఆధారపడడాన్ని మనం తగ్గించుకోవాలి. ఎగుమతులకు కొత్త గమ్యాలను వెతకాలి. స్థానిక మార్కెట్లలోనూ దీనిపై అవగాహన కల్పించాలి. నాణ్యమైన, పర్యావరణహితమైన స్థానిక ఉత్పత్తుల కోసం జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్ అనే సూత్రం ఆధారంగా మనం పనిచేయాలి. ప్రస్తుతం టాలెంట్, ట్రేడ్, టెక్నాలజీని దేశం ప్రోత్సహిస్తోంది. దేశంలో ప్రతిరోజు డజన్ల కొద్దీ స్టార్టప్స్ నమోదవుతున్నాయి. ప్రతివారం ఒక యునికార్న్ సంస్థ ఆవిర్భవిస్తోంది. ఆత్మనిర్భర భారత్ మన మార్గం, మన సంకల్పం అంటూ పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజల మద్దతుతో ప్రభుత్వానికి సంకల్పం ఉంటే మార్పు సాధ్యమవుతుందన్నారు మోదీ.
మహారాష్ట్ర, పుణెలోని జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్-(జేఐటీఓ)ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ‘జీటో కనెక్ట్-2022’ బిజినెస్ మీట్లో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ సాంకేతికత, పునర్వినియోగ టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిల్లో ఔత్సాహికులు పెట్టుబడులు పెట్టాలని కోరారు. 40 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్న జెమ్ ఈ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ను పరిశీలించాలని జేఐటీఓ ప్రతినిధులకు సూచించారు. అందులోని చాలా మంది ఎంఎస్ఎంఈ, ఎస్హెచ్జీలేనన్నారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం భారత్వైపు చూస్తోందని, అది మనకు గర్వకారణమన్నారు. ‘ఓకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని అవలంబించాలని, విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు.