ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్షా ద్వయం హయాంలో బీజేపీ దేశంలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే మే 10వ తేదీన జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఆ పార్టీకి పెను సవాల్గా పరిణమించాయి. కన్నడనాట ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. గతంలో ఇక్కడ అధికారాన్నిచేజిక్కించుకోవడానికి పలు వ్యూహాలు అనుసరించి విజయం సాధించిన ఆ పార్టీ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది.
ఈసారి జేడీఎస్ ప్రభావం స్వల్పమే
ఇక్కడ ఈ రెండు పార్టీలే ప్రధాన ప్రత్యర్థులుగా ఉండగా, మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ మూడో పక్షంగా ఉంది. గత ఎన్నికల ఫలితాల తర్వాత తక్కువ సీట్లే గెలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఊహించనివిధంగా కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నా ఎంతోకాలం అధికారాన్ని నిలుపుకోలేకపోయారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది.
ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడమే సవాల్
ప్రస్తుతం అక్కడ బీజేపీకి చెందిన బసవరాజ్బొమ్మై ముఖ్యమంత్రిగా ఉన్నారు. సొంత పార్టీలో అసమ్మతితోపాటు అధికారపార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకత కూడా పార్టీని భయపెడుతోంది. మరోపక్క అధిక శాతం సర్వేలు మాత్రం ఈసారి కాంగ్రెస్ గాలి వీయడం ఖాయమని తేల్చేశాయి. మరోపక్క కర్నాటక సహకార సమాఖ్యకు చెందిన పాల ఉత్పత్తి బ్రాండ్ నందిని- గుజరాత్ కు చెందిన అమూల్ బ్రాండ్ విస్తరణల అంశం బీజేపీ ప్రభుత్వాన్నిసంకటస్థితిలోకి నెట్టగా.. కాంగ్రెస్ పార్టీకి ఇది రాజకీయ ఆయుధంగా మారింది. అయితే పార్టీని ఎలాగైనా మరోసారి విజయతీరాలకు చేర్చడమే మాజీ సీఎం యడియూరప్ప సహా ఇతర నేతలను సమన్వయం చేస్తూ బీజేపీ మోహరించింది. ఇక జేడీఎస్ కూడా ఈసారి అన్నిస్థానాల్లోనూ పోటీకి దిగుతూ ఇప్పటికే 49మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కూడా విడుదల చేశారు. అయితే ఈసారి ఆయన పార్టీ కీలకమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
మారిన రాజకీయ పరిస్థితులు..
అయితే గతంలో బీజేపీలో ఉన్న గాలి జనార్దన్రెడ్డి సొంత కుంపటి పెట్టుకోవడం, పొరుగు రాష్టం మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ దాదాపు 45 స్థానాల్లో పోటీకి దిగాలనుకోవడం ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాల్సిఉంది.
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ ఫలితాలు కీలకంగా మారాయి. ఈసారి ఉత్తరాదిన తమకు కొన్నిసీట్లు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్న బీజేపీ ఆమేరకు దక్షిణాదిన తమబలం పెంచుకోవాలని గట్టిగా భావిస్తోంది. కర్నాటకలో ఆ పార్టీకి అధికారం చేజారితే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలన్న ఆశలకు తాత్కాలికంగానైనా బ్రేకులు పడినట్టే. అయితే ఆ పరిస్థితి రాకుండా కన్నడనాట గెలుపు కోసం ఆ పార్టీ సర్వశక్తులూ ఒడ్డటం ఖాయంగా కనిపిస్తోంది.