ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి సీబీఐ తాజాగా నోటీసులు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సర్కారులో కీలక పదవుల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ప్రశ్నించి ఆయన నుంచి కూడా వివరాలు రాబట్టాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఏప్రిల్ 16న విచారణకు హాజరు కావాల్సిందిగా అరవింద్ కేజ్రీవాల్ కి సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు.
ఇప్పటికే ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కవిత కూడా ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
మరోవైపు మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ సైతం హైదరాబాద్ కి హవాలా మార్గంలో నగదు చేరవేసినట్టుగా చెబుతూ వెల్లడించిన వివరాలు కూడా ఎమ్మెల్సీ కవిత వైపై వేలెత్తి చూపిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కవితకు కూడా ఇంకా లిక్కర్ స్కామ్ విడిచిపెట్టేలా కనిపించడంలేదు.