వైసీపీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణ చేసారు.
వైఎస్ విజయమ్మ, షర్మిల జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి సీఎం జగన్ ఒకరిద్దర్ని చంపేస్తారని .. సానుభూతి కోసం ఏమైనా చేస్తారని డీఎల్ రవీంద్రారెడ్డి అనుమానం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాలలో పెను దుమారంలేపుతోంది.. గత ఎన్నికల్లో సానుభూతి కోసం కోడికత్తి, వివేకా హత్య ఘటనలు చోటు చేసుకున్నాయని.. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలతోనే ఇది జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి ఏమైనా చేస్తారని డీఎల్ రవీంద్రారెడ్డి స్పష్టంగా చెపుతున్నారు. జగన్ పై కోడికత్తితో దాడి వెనుక కుట్రకోణం లేదని కోర్టుకు ఎన్ఐఏ తెలిపిందని చెప్పారు. తాడేపల్లి నుంచి వైఎస్ భారతి రాజ్యాంగం నడుస్తోందని డీఎల్ దుయ్యబట్టారు. వివేకా హత్య కేసులో ఎంత మంది అధికారులను మార్చినా ఒరిగేది లేదని… నిందితులకు కచ్చితంగా శిక్ష పడుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయనని డీఎల్ చెప్పారు. కోడి కత్తి కేసు ఉత్త డ్రామా అని ఎన్ఐఏ చెబుతూండటం రాష్ట్రంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో వివేకా హత్య కేసులోనూ జగన్ తీరు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికలకు ముందు సానుభూతి కోసం ఎవర్నో ఒకర్ని చంపుతారన్న విమర్శలు కొంతకాలంగా రాజకీయ ప్రత్యర్థుల నుంచి వస్తున్నాయి. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న సమయంలో… వీళ్లంతా అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందంటూ వైసీపీలోనే బలమైన నేతలు తీవ్రంగా ఆందోళన చెందడం పరిస్థితికి అడ్డం పడుతోంది. నిజంగా వీళ్లు భయపడుతున్నట్లు జగన్ అధికారం కోసం అంత క్రూరంగా వ్యవహరిస్తారా? అనే చర్చ నడుస్తోంది.