బెంగాల్కు చెందిన సినీనటి, మోడల్ అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈడీ అధికారుల సోదాల్లో బయటపడిన రూ. 21 కోట్లు ఆ రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీకి చెందినదేనని అర్పిత అధికారులకు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆ సొమ్మును వేరే చోటుకు తరలించాలనుకుంటున్న సమయంలోనే ఈడి సోదాలు జరపడంతో అక్రమాలకు సంబంధించిన సొమ్ముతో దొరికిపోయినట్టు ఆమె ఈడీకి వాంగ్మూలమిచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వంలో ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ గతంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. ఆ కాలంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా మంత్రికి సన్నిహితురాలిగా పేరున్న అర్పితా ముఖర్జీ, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ప్రకాశ్ అధికారి, టీఎంసీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య సహా మరికొందరి నివాసాలపై ఈడీ జరిపిన సోదాల్లో అక్రమార్జన బయటపడింది. దీంతో అర్పితా ముఖర్జీతోపాటు, మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
దోషిగా తేలితే కఠినంగా శిక్షించాల్సిందే : ముఖ్యమంత్రి మమతాబెనర్జీ
ఇక మంత్రి పార్థా ఛటర్జీ అక్రమాల కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం తొలిసారిగా స్పందించారు. పార్థా ఛటర్జీ దోషిగా రుజువైతే ఆయనకు జీవిత ఖైదు విధించినా తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆమె ప్రకటించారు. తానెప్పుడూ అవినీతిని సమర్థించబోనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అర్పితా ముఖర్జీతో తమ పార్టీకి గానీ, ప్రభుత్వానికి గాని ఎలాంటి సంబంధం లేదని, పార్థా ఛటర్జీ స్నేహితురాలిగానే ఆమె తనకు తెలుసని మమత తెలిపారు. వేగంగా దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలని ఆమె ఈడీని కోరారు. కాగా మంత్రి పార్థా ఛటర్జీ మూడు సార్లు సీఎం మమతకు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా మమత మాట్లాడేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది.