కాలుష్య నియంత్రణలో భాగంగా మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే.. ప్రతి సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోనికి వాహనాలకు అనుమతి లేదు. దీంతో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సోమవారం ఉదయం ఆరిలోవలోని తన క్యాంప్ ఆఫీస్ నుంచి నడుచుకుంటూ అక్కడకు దగ్గరలో ఉన్న బస్టాప్ కి చేరుకున్నారు. అక్కడి బస్సు ఎక్కి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని స్పందన కార్యక్రమం నిర్వహించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లోనికి ప్రతి సోమవారం వాహనాలను అనుమతించడం లేదని ఆమె చెప్పారు. అందుకు ఉద్యోగులు, జీవీఎంసీ పనులపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య ప్రజలు తమ ప్రయత్నానికి సహకరిస్తున్నారన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలో వారంలో ఒకరోజు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ఒక్కరోజు తమ సొంత వాహనాలను పక్కనపెట్టాలని, ప్రజా రవాణా ద్వారా తమతమ కార్యాలయాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.