ఇంగ్లండ్ ప్రధాని మంత్రి పదవికి పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద ముప్పుగా పరిణిమించిందని, బ్రిటన్, అమెరికాలతో పాటు భారత్ కూడా చైనాకు లక్ష్యాలుగా మారిపోయాయని రిషి సునాక్ అన్నారు. ఇందుకు పలు ఆధారాలు కనిపిస్తున్నాయని చెప్పిన ఆయన.. తాను బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైతే .. చైనా దూకుడును నిలువరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తానని తెలిపారు. నాటో మాదిరి సరికొత్త మిలటరీ కూటమిని ఏర్పాటు చేయడంతోపాటు, చైనా నుంచి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు ప్రణాళికలు కూడా తన వద్ద ఉన్నట్టు ఓ టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా రిషి సునాక్ చెప్పుకొచ్చారు.
బ్రిటన్ సహా ఇతర పశ్చిమ దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతోకాలంగా చైనా తస్కరిస్తోందని రిషి సునాక్ ఆరోపించారు. ఉక్రెయిన్పై దాడి అంశంలో రష్యాకు అండగా నిలవడం ప్రపంచంలో అస్థిరత సృష్టించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నమేనన్నారు, తైవాన్పై తరచుగా హెచ్చరికలు, షిన్జియాంగ్, హాంకాంగ్లలో మానవ హక్కుల హననం ఇవన్నీ చైనా కుట్ర పూరిత స్వభావాన్ని తెలియజేసేవేనని చెప్పిన సునాక్.. చైనాను నిలువరించేందుకు అమెరికాతో పాటు ఇతర పాశ్చ్యాత్త దేశాలతో కలిసి పని చేస్తానని, పలు ప్రపంచ దేశాలతో విస్తృత కూటమి ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు.
కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల ఓట్లను పొందడంలో ఇతర అభ్యర్థులపై అన్నిరౌండ్లలోనూ స్పష్టమైన ఆధిక్యం పొందిన రిషి సునాక్, ఆ పార్టీకి చెందిన అర్హులైన 1,60,000 వేలమంది సభ్యుల్లో అధికుల మద్దతు కూడా పొందగలిగితేనే పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికై, బ్రిటన్ ప్రధాని పీఠాన్ని చేరుకోగలరు. అయితే కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో రిషి సునాక్ కంటే ఆయనకు పోటీదారైన లిజ్ ట్రస్కే ప్రస్తుతం ఎక్కువ మద్దతు లభిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి మారి రిషి సునాక్ వారి మద్దతును సాధించే అవకాశాలూ లేకపోలేదని బ్రటన్ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.