ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ అవినీతి సొమ్ము ఈడీ శోధనల్లో మరింతగా బయటపడుతూనే ఉంది. ఆయన సన్నిహితురాలు, సినీనటి అర్పితాముఖర్జీకి చెందిన రెండిళ్లలో ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా నగదు, భారీగా బంగారం, కీలక పత్రాలు లభ్యం అయ్యాయి. కాగా తమకు లభించిన సమాచారంతో ఆమెకు చెందిన మరో ఇంటిలోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ ఇంట్లోనూ భారీగా సొమ్ము దాచినట్టు ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో మంత్రి అక్రమాలు ఏ స్థాయిలో సాగాయో అర్థమవుతోంది.
మొదట్లో ఇదంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రగా కొట్టిపారేస్తూ, ఎదురుదాడికి తెగబడిన టీఎంసీ ప్రభుత్వ పెద్దలకు ఈ కేసులో ఎదురవుతున్న పరిణామాలు దిమ్మ దిరిగిపోయేలా చేస్తున్నాయి. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన మంత్రివర్గం నుంచి పార్థా ఛటర్జీని తొలగించారు. అంతేకాదు.. పార్టీ పదవుల నుంచి, పార్టీ నుంచి కూడా ఆయనను సస్పెండ్ చేశారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఈమేరకు ప్రకటించారు. అయితే కేసు దర్యాప్తులో ఆయన నిర్దోషిగా తేలితే పార్టీ తలుపులు ఆయనకు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.
అవినీతి కేసులో అరెస్టయిన పార్థా ఛటర్జీ గతంలో దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆ పార్టీ సెక్రటరీ జనరల్గా వ్యవహరించారు. మమతాబెనర్జీకి నమ్మకమైన అనుచరుడిగా ఉన్న ఆయనకు ఈ ఏడాది ప్రారంభంలో పార్టీ ఉపాధ్యక్ష పదవి కూడా లభించింది.