చిత్ర పరిశ్రమ కొంతకాలంగా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రసిద్ధ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలపై సామాన్య ప్రేక్షకులకు ఆసక్తి పోయిందని, ఇప్పుడు వారిని థియేటర్లకు రప్పించడం పెద్ద ఛాలెంజ్గా మారిపోయిందన్నారు. ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లి ఇష్టం వచ్చినట్టు టికెట్ ధరలు పెంచుకోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. థియేటర్ల వద్ద ఉండే క్యాంటీన్లలో అన్నిటికీ విపరీతమైన ధరలు ఉంటాయని, సామాన్య ప్రేక్షకులు కుటుంబంతో సినిమా చూడాలంటే భరించలేని పరిస్థితి రావడంతో వారు రావడానికి ఇష్టపడటం లేదన్నారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్పై హనూ రాఘవపూడి దర్శకుడిగా రూపొందించిన సీతారామం చిత్రం ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో గురువారం అశ్వనీదత్ మీడియాతో మాట్లాడారు. నిర్మాతల శ్రేయస్సు కోసమే గతంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటైందని, మరి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో ఐక్యత, స్థిరత్వం లేకపోవడంతోనే సమస్యలొస్తున్నాయన్నారు. హీరోల పారితోషికాల కారణంగానే సినిమా టికెట్ల ధరలు పెంచుతున్నారనేది నిజం కాదన్నారు.
నిర్మాతలందరూ కలిసి చేసే నిర్ణయానికి సంపూర్ణ మద్దతు
తాను గత యాభై ఏళ్లుగా చిత్రాలను నిర్మిస్తున్నానని, మిగిలిన నిర్మాతలందరితోనూ మంచి సంబంధాలే ఉన్నాయని, ఎవరినీ అగౌరవపరచే ఉద్దేశం లేదని అశ్వనీదత్ అన్నారు. చిత్ర పరిశ్రమలో అందరూ ఒక్కతాటిపై ఉండాలనేదే తన అభిప్రాయమని, పరిశ్రమకు కాపాడేందుకు అందరూ కలిసి మంచి నిర్ణయం తీసుకుంటే దానిని తాను స్వాగతిస్తానని, పూర్తి మద్దతు ఇస్తానని ఆయన తెలిపారు.