మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిలు ఇవ్వడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడం దారుణమని సుప్రీం కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఆ పిటిషన్ ను శుక్రవారం (ఏప్రిల్ 20) విచారించిన సుప్రీం కోర్టు అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిలుపై స్టే విధించింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి తీర్పులు కూడా ఉంటాయా అని సుప్రీం వ్యాఖ్యానించింది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అయితే సోమవారం ఉదయం వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ పిటిషన్ ను సోమవారం ఉదయమే విచారిస్తామని సుప్రీం పేర్కొంది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం చేసిన వ్యాఖ్యలు వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది.
తన తండ్రి హత్య కేసు దర్యాప్తునకు ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని సునీత ఆరోపించారు. అవినాష్ రెడ్డిని ఏపీ సీఎం జగన్ కాపాడుతున్నారని కూడా సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా తన పిటిషన్ లో ఏపీ సీఎం, తన సోదరుడు అయిన జగన్ పై కూడా సునీత ఆరోపణలు చేశారు. ఒక వైపు కేసు దర్యాప్తు జరగుతుండగానే సీఎం హోదాలో అసెంబ్లీలో జగన్ అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారని సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిందితుడికి క్లీన్ చిట్ ఇవ్వడమేమిటని పేర్కొన్న ఆమె.. ఈ కేసు దర్యాప్తు సజావుగా సాగకుండా రాష్ట్ర ప్రభుత్వం సకల యత్నాలు చేసిందని ఆరోపించారు.
మొత్తం మీద హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు విస్పష్టంగా తేల్చేసింది. దీంతో సోమవారం అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమనే అభిప్రాయాన్ని న్యాయ నిపుణలు వ్యక్తం చేస్తున్నారు.