చౌక ధరలకే అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అందిస్తూ భారతమార్కెట్లో అత్యధిక శాతం చేజిక్కించుకున్న చైనా మొబైల్ కంపెనీలకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. రూ. 12 వేల లోపు ధరల్లో మొబైల్ ఫోన్లను దేశంలో విక్రయించడంపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
నిజానికి ఐదారేళ్ల క్రితం వరకు తక్కువ ధరలకు లభించే స్మార్ట్ఫోన్ మార్కెట్ అత్యధిక శాతం భారత కంపెనీల చేతుల్లోనే ఉండేది. ప్రధానంగా మైక్రోమ్యాక్స్, లావా వంటి కంపెనీలు తమ ఉత్పత్తులతో ఆకట్టుకునేవి. అయితే చైనా కంపెనీల హవా పెరిగాక భారత కంపెనీలు వాటి పోటీకి తట్టుకోలేక దాదాపు తెరమరుగయ్యాయి.
ఇప్పుడు రూ. 12 వేలలోపు ధరలో లభించే స్మార్ట్ఫోన్ల మార్కెట్లో రియల్ మీ, షావోమి, ఒప్పో, వివో వంటి చైనా కంపెనీల గుత్తాధిపత్యం నడుస్తోంది. ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకునే చర్యలతో చైనా కంపెనీలకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. అదే సమయంలో దేశీ తయారీ కంపెనీలకు మళ్లీ జవజీవాలనందించే చర్య అవుతుంది. ఖరీదైన ఫోన్ల మార్కెట్లో ప్రధాన కంపెనీలైన యాపిల్, సామ్సంగ్ లపై ఈ ప్రభావం పెద్దగా ఉండదు.