ఇటీవలికాలంలో అంతర్జాతీయంగా భారీగా పెరిగిన ముడి చమురు ధరలు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెనుభారంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే శ్రీలంకలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటడంతోపాటు, ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడటంతో ఆ దేశంలో ఏకంగా ప్రజలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ మరో పొరుగుదేశం బంగ్లాదేశ్లోనూ పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా ప్రజలు రోడ్లమీదకు రావడం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ కారణంగా బ్యారెల్ ముడి చమురు ధరలు దశాబ్దకాల గరిష్టానికి చేరిన విషయం తెలిసిందే. నెలల తరబడి బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లకు పైగానే కొనసాగుతుండటంతో దిగుమతులపై ఆధారపడ్డ దేశాల వద్ద ఉన్నవిదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతున్నాయి.
ఒకేసారి 50 శాతం పైగా పెరిగిన పెట్రో ధరలు
ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ కూడా పెట్రో ధరలను ఒకేసారి సుమారు 50 శాతానికి పైగా పెంచింది. దీంతో లీటరు పెట్రోల్ ధర అక్కడ 130 టాకాలకు పెరిగింది. ఇదే బాటలో డీజిల్, ఆక్టేన్, కిరోసిన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో బస్సులు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పెరిగాయి. దీంతో బంగ్లాదేశ్ ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు మొదలుపెట్టారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే పెట్రో ధరలు పెంచాల్సివచ్చిందని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని అక్కడి ప్రభుత్వం చెపుతోంది.
ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదముందా..?
అయితే శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు బంగ్లాదేశ్కు ఎదురయ్యే ప్రమాదం తక్కువేనని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. గడచిన దశాబ్దకాలంలో శరవేగంగా ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా బంగ్లాదేశ్ నిలిచింది. అంతకుముందు 100 బిలియన్ డాలర్లకు దిగువన ఉన్న ఆ దేశ జీడీపీ ప్రస్తుతం 416 బిలియన్ డాలర్ల స్థాయికి పుంజుకుంది. ఇందుకు చైనా వ్యూహాత్మకంగా ఆ దేశంలో పెట్టిన పెట్టుబడులూ కారణమే. టెక్స్టైల్స్, రెడీమేడ్ గార్మెంట్స్, లెదర్ ప్రొడక్ట్స్, జ్యూట్ ఉత్పత్తులు, ఇంజనీరింగ్, చేపలు, రొయ్యలు, వ్యవసాయ ఉత్పత్తులను ఆ దేశం ప్రధానంగా ఎగుమతి చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంది. అయితే అధిక పెట్రో ధరల ప్రభావం ఆ దేశ అభివృద్ది రేటును గణనీయంగా దెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది.