ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో విసిగివేసారిన జనం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపడానికి సన్నద్దమయ్యారా? ఔననే అంటున్నాయి పలు సర్వేలు ..
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు మూడు రోజుల ముందు.. అంటే.. మే 10, 2024 న ”అభి న్యూస్” సర్వే విడుదల చేసాం. (పోలింగ్ తేదీ.. మే 13, 2024) 13 ఉమ్మడి జిల్లాల వారీగా సర్వే వివరాలు వెల్లడిస్తున్నాం..
.. మెగా డీఎస్సీ, మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు వంటి 2019లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో మెజార్టీ నెరవేర్చకపోవడంతోపాటు.. అభివృద్ధిని విస్మరించడం, కక్ష్యలు, కార్పణ్యాలతో పాలన సాగించడం వంటి వాటితో జనంలో తీవ్ర వ్యతిరేఖత వచ్చింది..
”ABHI NEWS” సర్వే ప్రకారం… వైసీపీ కంటే.. టీడీపీ కూటమికి.. 7 శాతం ఓట్లు అధికంగా వస్తాయని సర్వే ఫలితాలను పరిశీలిస్తే తెలిసింది. టీడీపీ కూటమికి 51.5 శాతం, వైసీపీకి 44.5 శాతం, కాంగ్రెస్ పార్టీకి 2.5 శాతం ఓట్లు వస్తాయని అభిన్యూస్ సర్వే స్పష్టం చేస్తోంది. నోటాకి సుమారు ఒక శాతం, ఇతరులకు 0.5 శాతం ఓట్లు పడే ఛాన్స్ ఉన్నట్లు అభిన్యూస్ అంచనా వేస్తోంది.
టీడీపీ కూటమి: 51.5%
వైసీపీ : 44.5%
కాంగ్రెస్ : 2.5 %
నోటా : 1 శాతం
ఇతరులకు : 0.5 శాతం
ఇవన్నింటి కంటే… రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ బుక్ లపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడపై ఎక్కువమందిని అనుమానాలకు గురిచేసింది. దీనికితోడు ఏపీ సర్కారు తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) పై రైతులలోనే కాకుండా.. కాస్తో.. కూస్తో సొంత స్థలం ఉన్న వాళ్ళలోనూ అనుమానాలు బలపడటం వైసీపీ సర్కార్ ను గద్దె దించడం ఖాయం… అని ”అభి న్యూస్” సర్వే లో తేటతెల్లం అయింది. తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములు, స్థలాలు, ఇళ్ళు.. ఇలా స్థిరాస్తులు పెట్టుకుని లోన్లు తీసుకువచ్చి ఆ సొమ్ముతో సంక్షేమ పధకాలు నిర్వహిస్తారన్న పుకార్లకు బలం చేకూరింది. కొంతమంది అయితే.. తమ భూములు తమకు కాకుండా పోతాయేమో అన్న ఆందోళనలో ఉన్నారు. వీరంతా వైసీపీకి వ్యతిరేఖంగా ఓటు వేస్తారని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు సర్వే లు సైతం దీనిని నిర్దారిస్తున్నాయ్.
ప్రముఖ మీడియా సంస్థ ‘Abhi News Network Private Limited’ ఆంధ్రప్రదేశ్ లో పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు దఫాలుగా నిర్వహించిన ఎన్నికల సర్వేలో కూటమి విజయం ఖాయం అయింది. అభి న్యూస్ బృందం, శిక్షణ పొందిన ఇతరులు 350 మంది సిబ్బంది.. 45 అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించిన ”ప్రజాభిప్రాయ సేకరణ”ను విశ్లేషించి, రాష్ట్రంలో పలు రాజకీయ ప్రాధాన్యత అంశాలను క్రోడీకరించి ఇస్తున్న ”సర్వే” ఇది. అత్యంత శాస్త్రీయంగా నిర్వహించిన ఈ సర్వే ద్వారా ”అభి న్యూస్..” డిజిటల్ ఫ్లాట్ ఫామ్.. పాఠకులలోనూ, ” “ABHI TV” ప్రేక్షలలోను మరింత విశ్వసనీయత పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
13 ఉమ్మడి జిల్లాలలో మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ .. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 117 సీట్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 58 సీట్లు వచ్చే అవకాశం ఉందని అభి న్యూస్ సర్వేలో స్పష్టమైంది.
లోక్ సభ సీట్లు 25 కు గానూ.. టీడీపీ కూటమికి 18-19 స్థానాలు, వైసీపీకి 6-7 స్థానాలు దక్కుతాయని మా సర్వేలో తేలింది. అరకు, నర్సాపురం, రాయచోటి, కర్నూలు, తిరుపతి, కడప పార్లమెంట్ సీట్లు వైసీపీకి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం పార్లమెంట్ సీట్లు టీడీపీ కూటమి గెలుచుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
ఇలా చేశాం సర్వే…
- రాష్ట్ర వ్యాప్తంగా 45 అసెంబ్లీ సెగ్మెంట్లలో అభి న్యూస్ బృందం, మా సంస్థ శిక్షణ ఇచ్చిన మరికొందరు.. మొత్తం 350 మంది టీమ్ ఈ సర్వే నిర్వహించడంలో భాగస్వాములయ్యారు.
- ఒక్కో అసెంబ్లీ పరిధిలో మండలాలు, గ్రామాల వారీగా మొత్తం 2,500 నుంచి 3 వేల మంది ఓటర్ల అభిప్రాయాలను తీసుకున్నారు మా బృంద సభ్యులు.
- అంటే మొత్తం మేము చేపట్టిన 45 అసెంబ్లీల పరిధిలో 1.20 లక్షల మందిని పలకరించారు మా బృంద సభ్యులు.
- ఇటీవల నిర్వహించిన సర్వేలలో ఇంత ఎక్కువమందిని నిర్వహించిన సర్వేలు చాలా తక్కువనే చెప్పాలి.
- ఈ సర్వేలో .. 20-30 ఏళ్ల యువత, 60-75 మధ్య వృద్దులు, 30-60 మధ్య వయస్కులైన మహిళలు, వ్యవసాయ కూలీలు, పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, వృత్తి పనివారు, డ్వాక్రా మహిళలు, ప్రయివేట్ ఉద్యోగులు.. ఇలా కేటగిరి వారీగా గణాంకాలు తీసుకున్నారు ‘అభి న్యూస్’ టీమ్ సభ్యులు.
- సర్వేలో పాల్గొన్న వ్యక్తుల వివరాలు గోప్యాంగా ఉంచాం.
- రెండవ విడత సర్వే ఏప్రిల్ 28, 2024 నుంచి మే నెల 7 వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది.
- ఎక్కువ మంది చేప్పిన అంశాలు:
- జగన్మోహన్ రెడ్డి పాలన కక్షపూరితంగా ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఇలా చేయలేదు.
- సంక్షేమం పేరుతో బాగానే డబ్బులు ఇస్తున్నారు.. కానీ పేదలకే కాకుండా, ఆర్ధికంగా ఉన్న వాళ్లకి కూడా అన్ని పథకాలలోను డబ్బు ఇస్తున్నారు.
- గతంలో ఎన్నడూలేనంతగా ఈ సారి జగన్ అధికారంలో ఉండగా గొడవలు ఎక్కువయ్యాయి.
- చంద్రబాబు ఇచ్చిన హామీల గురించి విశ్వాసం వ్యక్తం చేసిన వారి సంఖ్య కూడా తక్కువగా ఉండటం గమనార్హం.
- చంద్రబాబును జైలులో పెట్టడంపై కూడా రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువగా స్పందించారు.
- ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై సర్వేలో పాల్గొన్న వారిలో 15-20 శాతం జనం ఆందోళన వ్యక్తం చేసారు.
- మెగా DSC, జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేసాడు.
- నాణ్యతలేని మద్యం, అదీ రేటు ఎక్కువ చేసి అమ్ముతూ.. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
- విద్యుత్ చార్జీలు , నిత్యావసర వస్తువుల ధరలు దారుణంగా పెంచేశారు.
- యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక, పొరుగు రాష్ట్రాలకు వలసపోవాల్సి వస్తోంది..
- మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుని ఖాతాకే సంక్షేమ సొమ్ము వేయడం జగన్ చేసిన అద్భుత సంస్కరణం.
- వృద్దులు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ గతంలో పంచాయతీ కార్యాలయాలకు వచ్చి లైనులో నిలబడి తీసుకోవాల్సి వచ్చేది.. జగన్ వచ్చాకా.. ఇంటి0టికీ తెచ్చి ఇస్తున్నారు.
- చంద్రబాబు ఫించన్ల పంపిణీని అడ్డుకున్నారు. ఇలా చేయడం దుర్మార్గం.. అని పలువురు వృద్దులు శాపనార్దాలు పెట్టారు.
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కంటే.. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుందని ఎక్కువమంది మేధావులు అభిప్రాయపడ్డారు. జగన్ అనే దుర్మార్గ పాలకుడిని సాగనంపకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోవాల్సిందే.. అని కొందరు కుండబద్దలు కొట్టినట్లు సర్వేలో వెల్లడించడం గమనార్హం.